ఎంపి సీఎం రమేష్ను సిబిఐ కేసులో ఇరికించేందుకు భారీ కుట్ర...
హైదరాబాద్: టీడీపీ ఎంపీ సీఎం రమేష్ను సీబీఐ కేసులో ఇరికించేందుకు ఒక భారీ కుట్ర జరిగిందని...అది తాజాగా వెలుగులోకి వచ్చినట్లు ఆంధ్రజ్యోతి పత్రిక ఒక వార్తా కథనంలో పేర్కొంది.
సతీష్బాబు సానా అనే వ్యక్తి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ఎంపి సిఎం రమేష్ పేరు ప్రస్తావించినట్లు ఒక స్టేట్మెంట్ను సృష్టించారని పేర్కొంది. అయితే దురుద్దేశంతో ఆ స్టేట్మెంట్ను సృష్టించిన విచారణ అధికారి, సీబీఐ డీఎస్పీ దేవేందర్కుమార్ని సీబీఐ అధికారులు అరెస్టు చేశారని ఆ కథనం వెల్లడించింది.
టిడిపి ఎంపి సిఎం రమేష్ని సిబిఐ కేసులో ఇరికించేందుకు గాను సెప్టెంబర్ 26న ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో సతీష్బాబు వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు దేవేందర్కుమార్ తప్పుడు సాక్ష్యాలను సృష్టించారని ఆంధ్రజ్యోతి కథనంలో వివరించారు. అయితే ఆ రోజు సతీష్ ఢిల్లీలో లేరని విచారణలో వెల్లడైందని...దీంతో ఈ ఘటనపై పూర్తి స్థాయిలో అధికారులు విచారణ జరిపి దేవేందర్ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
వాస్తవానికి విచారణలో సతీష్ సానా ఇచ్చిన వాంగ్మూలానికి...దేవేందర్కుమార్ నమోదు చేసిన వాంగ్మూలానికి అసలు సంబంధమే లేదని అధికారులు తేల్చారని ఆంధ్రజ్యోతి పేర్కొంది. అసలు ఎంపి సీఎం రమేష్ పేరును సతీష్ సానా చెప్పకపోయినా...చెప్పినట్లుగా డీఎస్పీ దేవేందర్ కుమార్ వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు ఆంధ్రజ్యోతి ఆ కథనంలో వెల్లడించింది.
అసలు సతీష్ సానా ఢిల్లీలో ఎటువంటి వాంగ్మూలం ఇవ్వనేలేదని, సీబీఐ డీఎస్పీ దేవేందర్కుమార్ తప్పుడు స్టేట్మెంట్ను సృష్టించారని సీబీఐ అధికారులు వెల్లడించారని ఆంధ్రజ్యోతి పేర్కొంది.