మోడీ రద్దు ప్రకటన: ఆ 4గంటల్లోనే రూ.50కోట్ల గోల్డ్ అమ్మేశారు
విశాఖపట్నం: పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు రోజువారీ ఖర్చుల కోసం ఇబ్బందుల ఎదుర్కొంటుంటే.. నల్లకుబేరులు మాత్రం తమ అక్రమ సొమ్మును ఏం చేయాలో ఆందోళన చెందుతూ వక్రమార్గాల వైపు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖ కేంద్రంగా ఒకేరోజులో రూ 50 కోట్ల రూపాయల బంగారం అమ్ముడైపోయి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.
రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసినట్టు కేంద్రం ప్రకటించిన మంగళవారం రోజు రాత్రి విశాఖ నగరంలో భారీయెత్తున బంగారం విక్రయాలు జరిగినట్టు ఆదాయపు పన్ను శాఖ అధికారులు గుర్తించారు. నోట్ల రద్దు ప్రకటన వెలువడిన 8వ తేదీ రాత్రి 8 గంటల తర్వాత నాలుగు గంటల వ్యవధిలోనే ఈ లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు.
కొన్ని ప్రముఖ బంగారు దుకాణాలు రాత్రి 8 నుంచి 12 గంటల మధ్య వ్యాపారులు లావాదేవీలు జరిపినట్టు స్పష్టమైంది. ఒక ప్రముఖ బంగారు దుకాణంలో రూ.9కోట్ల మేర వ్యాపార లావాదేవీలు జరిగినట్టు నిర్ధారించారు. సాలీనా రూ.100 కోట్ల వ్యాపారం నిర్వహించే పారిశ్రామికవేత్తలు, వ్యాపారవర్గాల వివరాలను తీసుకుని, వారి లావాదేవీలను పరిశీలించినట్టు ఐటి వర్గాలు పేర్కొంటున్నాయి.
అయితే అటు కొనుగోలుదారులు, ఇటు వ్యాపారులు చట్టంలో లొసుగులను ఆసరా చేసుకుని నాలుగు గంటల వ్యవధిలోనే రూ.50 కోట్ల నల్లధనాన్ని బంగారం రూపంలోకి మార్చినట్టు ఐటి అధికారులు అనుమానిస్తున్నారు. రూ.2 లక్షల వరకు కొనుగోళ్లకు పాన్కార్డు అవసరం లేదన్న నిబంధన ఇక్కడ బంగారు వర్తకులు అన్వయించుకున్నారు. దీంతో నోట్ల రద్దునాటి లావాదేవీలన్నీ రూ.2 లక్షల లోపే ఉండటంతో ఐటి అధికారులు విచారణ జరుపుతున్నారుు.
కాగా, ఈ వివరాలు వెల్లడించేందుకు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో ఇప్పుడు ఐటి అధికారులు బంగారు వర్తకుల మెడకు ఉచ్చు బిగించేలా వ్యూహరచన చేస్తున్నారు. వర్తకుల వద్దనున్న నల్లధనం తెల్లధనంగా మార్చుకునేందుకే అర్ధరాత్రి లావాదేవీలకు పాల్పడ్డారంటూ ఐటి అధికారులు తాఖీదులు ఇచ్చారు.
దీంతో కొనుగోలుదారుల వివరాలు వెల్లడిస్తామంటూ బంగారు వర్తకులు దారిలోకి వస్తున్నారు. విశాఖ నగరంలో లెక్కల్లో చూపని నల్లధనం రూ.500 కోట్ల వరకూ ఈ విధంగా చేతులు మారి ఉంటుందని ఐటి అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, ఆ వ్యవహారాలన్నింటిని ఎలా వెలుగులోకి తెస్తారనేది ఆసక్తికరంగా మారింది.