ఏపీ ప్రజలకు ఊరట - రేపటి నుంచి ఉదయం 6 నుంచి 1 గంట వరకూ షాపులు - మరిన్ని తాత్కాలిక రైతు బజార్లు..
ఏపీలో కరోనా వైరస్ ప్రభావం నియంత్రణలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉదయం నిత్యావసర వస్తువుల కోసం పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని షాపింగ్ సమయాలను పెంచడంతో పాటు రైతు బజార్లను వికేంద్రీకరించాలని నిర్ణయించింది. కాగా ఇవాళ రాష్ట్రంలో కొత్తగా ఎలాంటి కేసులు నమోదు కాకపోవడంతో ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.
ఏపీ ప్రజలకు లాక్ డౌన్ నుంచి కాస్త ఊరట..
ఏపీలో కరోనా వైరస్ ప్రభావం మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే నియంత్రలో ఉన్న నేపథ్యంలో తాజాగా పరిస్ధితిని సమీక్షించిన ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ముఖ్యంగా ఉదయం నిత్యావసరాల కోసం ప్రజలు ఎగబడుతున్న నేపథ్యంలో మూడు గంటలుగా ఉన్న సమయాన్ని మరో నాలుగు గంటలు పెంచింది. అంటే రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ షాపులు తెరిచి ఉంచేందుకు అవకాశం కల్పించారు. అయితే పరిమిత సంఖ్యలో మాత్రమే జనాన్ని అనుమతిస్తారు.
రైతు బజార్ల వికేంద్రీరణ- తాత్కాలిక ఏర్పాట్లు..
ప్రస్తుతం వివిధ జిల్లాల్లో ఉన్న రైతు బజార్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. అందులోనూ కరోనా లాక్ డౌన్ భయాలతో ప్రజలు వాటికి బీభత్సంగా ఎగబడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ ప్రకటన వస్తుందో తెలియక ఆందోళనలో ఉన్న జనం.. రైతు బజార్లకు క్యూ కడుతున్నారు. దీంతో అక్కడ విపరీతంగా రద్దీ ఏర్పడుతోంది. దీని వల్ల వీరిలో ఏ ఒక్కరికి కరోనా లక్షణాలున్నా అత్యంత వేగంగా మిగతా వారికి సోకే ప్రమాదం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రైతు బజార్లను వికేంద్రకరించాలని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు. అంటే ప్రస్తుతం ఉన్న రైతు బజార్లను రెండు, మూడు రైతు బజార్లుగా విడదీస్తారు. కొత్తగా గుర్తించిన ప్రాంతాల్లో తాత్కాలిక రైతు బజార్లు ఏర్పాటు చేస్తారు. అక్కడ కూడా ప్రత్యేక గళ్లు గీసి, క్యూలైన్లలోనే అనుమతిస్తారు.
Recommended Video
మిగతా ఆంక్షలన్నీ మామూలే...
నిత్యావసర వస్తువుల కొనుగోళ్లకు ఉన్న సమయాలను పెంచుతున్న ప్రభుత్వం.. లాక్ డౌన్ లో భాగంగా మిగిలిన ఆంక్షలను మాత్రం యథాతథంగా అమలు చేయబోతోంది. దీని ప్రకారం ప్రజలు తమ ఇళ్ల నుంచి కేవలం 2,3 కిలోమీటర్ల దూరంలో మాత్రమే కొనుగోళ్లకు అనుమతిస్తారు. ఆ మేరకు నిత్యావసర సరుకులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్ధాయి సమీక్షలో నిర్ణయించారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున నలుగురికి మించి ఎక్కడా గుమి కూడదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అలాగే కూరగాయలకు నిర్ణీత రేట్లను నిర్ణయించిన ప్రభుత్వం వాటిని ప్రతిరోజూ పత్రికల్లో, టీవీల్లో ప్రకటిస్తుంది. వాటి కంటే ఎక్కువ ధరకు అమ్మితే 1902 కాల్ సెంటర్ కు ఫిర్యాదు చేయొచ్చని ప్రభుత్వం చెబుతోంది.