అంఫన్ తుఫాన్ తో ఏపీకి తప్పిన గండం: ఊపిరి పీల్చుకున్న తీరప్రాంత ప్రజలు
వాయవ్య బంగాళాఖాతం మీదుగా అంఫన్ పెనుతుఫాన్ ముంచుకొస్తుందని భయపడిన ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అతి తీవ్ర తఫాను అంఫన్ తీరం దాటడంతో ఏపీకి ముప్పు తప్పింది. అంఫన్ తుఫాను పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో తీరాన్ని దాటింది. నిన్న రాత్రి పశ్చిమ బెంగాల్లోని దిఘా, బంగ్లాదేశ్లోని హతియా ద్వీపం మధ్యనున్న సుందరబన్ ప్రాంతానికి దగ్గరగా తుఫాను తీరాన్ని తాకినట్టు ఐఎండీ వెల్లడించింది.
Recommended Video
ఉంపన్ తుఫాన్ గండం నుండి గట్టెక్కిన ఏపీ
తుఫాను తీరం దాటిన సమయంలో భీకర గాలులు బీభత్సం సృష్టించాయి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో గంటకు 170 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీశాయి.ఇక ఏపీ తుఫాను భయం నుండి బయటపడింది. తుఫాను తీరం దాటినందున ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు తొలగించారు. విశాఖ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో నిన్న మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు వాటిని తొలగించారు .
తుఫాను గమనాన్ని నమోదు చేసిన విశాఖ డాప్లర్ వెదర్ రాడార్
ఇక తుఫాను తీరం దాటటం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అతితీవ్ర తుఫాన్ గమనం, ఛాయాచిత్రాలను విశాఖ డాప్లర్ రాడార్ నమోదుచేసింది. కైలాసగిరిపై డాప్లర్ వెదర్ రాడార్ ఏర్పాటు చేసిన తరువాత బంగాళాఖాతంలో ఏర్పడిన తొలి సూపర్ సైక్లోన్ ఇదే కావటం గమనార్హం . అంఫన్ తుఫాను విశాఖ తీరానికి 401 కిలోమీటర్ల నుంచి 470 కిలోమీటర్ల దూరం మధ్య సముద్రంలో పయనించినట్టు అధికారులు తెలిపారు.
తీరప్రాంతాల్లో వర్షం .. తుఫాను తీరం దాటటంతో ఉపశమనం
అంఫన్ తుఫాన్ కారణంగా శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట, పోలాకి, గార, కవిటి, సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు, ఇచ్ఛాపురం, రణస్థలం ప్రాంతాల్లో సముద్ర కెరటాలు ఎగిసిపడ్డాయి. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో కాకినాడ యాంకరేజ్ పోర్టులో బియ్యం లోడింగ్ ఆగిపోయింది . ఇక సముద్ర తీర ప్రాంతాలలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. అసలే కరోనా కష్ట కాలంలో ఉన్న ఏపీ ప్రభుత్వానికి మరో దెబ్బ అన్నట్టు విశాఖ గ్యాస్ లీక్ ఘటన అనుకోని విపత్తుగా మారింది. ఇక ఇదే సమయంలో ప్రకృతి కూడా కన్నీర్ర చేస్తుందేమో అని అంతా భయపడ్డారు. కానీ అంఫన్ పెనుతుఫాన్ హమ్మయ్య అనిపించింది. పశ్చిమ బెంగాల్ వద్ద తీరాన్ని తాకి తెలుగు రాష్ట్ర ప్రజలకు పెద్ద ఉపశమనం కలిగించింది .