టీడీపీకి భారీ ఊరట- మంగళగిరి ఆఫీసు స్వాధీనంపై పిల్ కొట్టేసిన హైకోర్టు...
టీడీపీకి ఇవాళ హైకోర్టులో భారీ ఊరట లభించింది. గతేడాది అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసిన మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం వ్యవహారంలో ఇవాళ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. పక్కనే ఉన్న ప్రభుత్వ స్ధలాన్ని ఆక్రమించి నిర్మించిన టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ స్ధానిక వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాజ్యాన్ని హైకోర్టు తోసిపుచ్చింది.
ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన వాజ్యాన్ని విచారించిన హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం... గతంలో ప్రభుత్వం తరఫున దీనిపై రిట్ పిటిషన్ దాఖలైనందున ఇక పిల్ అవసరం లేదని వ్యాఖ్యానించింది. గత ప్రభుత్వం టీడీపీ కేంద్ర కార్యాలయం కోసం కేటాయించిన భూమిలో 3.65 ఎకరాల స్ధలం పోరంబోకు భూమి కాబట్టి దీని కేటాయింపు కోసం ఇచ్చిన జీవో 228 చట్ట విరుద్ధమని పిటిషన్ తరఫు న్యాయవాది వాదించారు.
ఇందులో నిర్మించిన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆళ్ల కోరారు. అయితే పిటిషన్ పై వాదనలు విన్న తర్వాత స్పందించిన న్యాయమూర్తులు.. ఇందులో పిటిషనర్ ఆళ్ల ఆసక్తి ఏమిటని ప్రశ్నించారు.