జగన్ సర్కారుకు సుప్రీంలో భారీ ఊరట-రాజ్యాంగ విచ్ఛిన్నం కేసులో స్టే
ఏపీ హైకోర్టులో దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్ల విషయంలో స్పందించిన హైకోర్టు రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందో తేల్చేందుకు విచారణ జరుపుతోంది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ సర్కారుకు ఇవాళ భారీ ఊరట లభించింది.
Recommended Video
ఏపీలో రాజ్యాంగ విచ్ఛిన్నంపై విచారణ జరపాలన్న హైకోర్టు నిర్ణయంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అడ్వకేట్ జనరల్ శ్రీరాం హాజరయ్యారు. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఏపీ హైకోర్టు తీరుపై విస్మయం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాలు ఆందోళన కరంగా ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను విచారించిన ఛీఫ్ జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం వీటిపై తీవ్ర అభ్యంతరం తెలిపింది.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ను వ్యతిరేకించిన సీనియర్ లాయర్ సిద్ధార్ధ లూత్రాపై సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు ఎన్నేళ్ల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారని ప్రశ్నించింది. ఇలాంటి ఆదేశాలు ఎప్పుడైనా ఇచ్చారా అని ప్రశ్నించింది. కనీసం హెబియస్ కార్పస్ పిటిషన్లపై విచారణకు అనుమతించాలని సిద్ధార్ధ లూద్రా కోరారు. రాజ్యాంగ సంక్షోభం ఉందనే భావనతో జడ్జి ప్రభావితం అయినందున అన్ని విచారణలపైనా స్టే విధిస్తున్నామని సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో రాజ్యాంగ విచ్ఛిన్నం అంశంతో సంబంధం ఉన్న అన్ని పిటిషన్ల ఆదేశాలపై స్టే ఇచ్చినట్లయింది. ఈ పిటిషన్పై తదుపరి విచారణను సుప్రీంకోర్టు సెలవుల అనంతరం విచారించనుంది.