డా రెడ్డీస్కు భారీ దెబ్బ: విశాఖ ప్లాంట్లో లోపాలంటూ జర్మనీ సంస్థ షాక్
డా. రెడ్డీస్ ల్యాబోరేటరీస్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. విశాఖపట్నం సమీపంలోని దువ్వాడ ఫార్ములేషన్ల తయారీ యూనిట్లో తనిఖీలను (ఆడిట్) జర్మనీ ఔషధ నియంత్రణ ప్రాధికార సంస్థ పూర్తి చేసింది.
హైదరాబాద్: డా. రెడ్డీస్ ల్యాబోరేటరీస్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. విశాఖపట్నం సమీపంలోని దువ్వాడ ఫార్ములేషన్ల తయారీ యూనిట్లో తనిఖీలను (ఆడిట్) జర్మనీ ఔషధ నియంత్రణ ప్రాధికార సంస్థ పూర్తి చేసింది. అయితే, కొన్ని లోపాలున్నట్లు గుర్తించినట్లు ఆ జర్మనీ సంస్థ పేర్కొంది. ఈ మేరకు వివరాలను డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ వెల్లడించింది.
లోపాలున్నాయ్...
ఔషధాల నాణ్యతకు ఎటువంటి ఇబ్బంది లేదని (జీరో క్రిటికల్) పేర్కొంటూ.. ఆరు ప్రధాన లోపాలు ఈ యూనిట్లో ఉన్నాయని జర్మనీ నియంత్రణ సంస్థ వెల్లడించినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ ఫార్ములేషన్ల యూనిట్ నుంచి యూరోపియన్ యూనియన్ (ఈయూ)కు ఔషధాలు ఎగుమతి కావడం లేదని, అథారిటీకి కరెక్టివ్ అండ్ ప్రివెంటివ్ యాక్షన్ ప్రణాళిక (సీఏపీఏ)ను సమర్పిస్తామని డాక్డర్ రెడ్డీస్ పేర్కొంది.
మరోసారి తనిఖీ..
ఈ యూనిట్కు 2018, నవంబరు వరకూ మాత్రమే ఈయూ-జీఎంపీ ధ్రువీకరణను ఇవ్వనున్నట్లు ఆడిటర్ పేర్కొన్నారు. కంపెనీ సీఏపీఏను సమర్పించిన తర్వాత దాన్ని పరిశీలించి అన్ని నిబంధనలకు అనుగుణంగా ఉందని నిర్ధారించుకుని, మళ్లీ తనిఖీలు చేసిన తర్వాతే ఈయూ-జీఎంపీ ధ్రువీకరణను కొనసాగిస్తామని జర్మనీ ఔషధ నియంత్రణ సంస్థ స్పష్టం చేసింది. ఆరు లోపాలను అథారిటీ గుర్తించిందని డాక్టర్ రెడ్డీస్ వెల్లడించినప్పటికీ.. అవి ఎటువంటి లోపాలో వెల్లడించలేదు.
కొనసాగుతున్న దావాలు
అమెరికాలోని మరో మూడు న్యాయ సంస్థలు డాక్టర్ రెడ్డీస్పై క్లాస్ యాక్షన్ కేసులు వేశాయి. కీలకమైన సమాచారాన్ని కంపెనీ వెల్లడించలేదని, మదుపర్లను కంపెనీ పక్కదారి పట్టించిందని, ఫెడరల్ సెక్యూరిటీస్ చట్టాలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ.. లెవి అండ్ కోర్సిన్స్కీ ఎల్ఎల్సీ, లండిన్ లా పీసీ, బ్రోన్స్టీన్ అండ్ జీవిట్జ్ అండ్ గ్రాస్మన్ ఎల్ఎల్సీలు క్లాస్ యాక్షన్ కేసులను దాఖలు చేశాయి.
భారీగా నష్టపరిహారాలు
2015, జులై 17 నుంచి 2017, ఆగస్టు 10 మధ్య డాక్టర్ రెడ్డీస్కు చెందిన అమెరికన్ డిపాజిటరీ రిసీట్ల (ఏడీఆర్)ను కొనుగోలు చేసిన మదుపర్లు నష్టపోయిన దానికి పరిహారం చెల్లించాలని దావాల్లో న్యాయ సంస్థలు పేర్నొన్నాయి. ఈ నేపథ్యంలో భారీగా పరిహారం చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
షేర్ల పతనం
దువ్వాడ ఫార్ములేషన్ల యూనిట్లో జర్మనీ ఔషధ నియంత్రణ సంస్థ 6 లోపాలను గుర్తించిందని వెల్లడి కావడంతో బీఎస్ఈలో షేరు ధర 2.93 శాతం నష్టంతో రూ.2,158.80 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1,081.82 కోట్ల మేరకు క్షీణించి రూ.35,791.18 కోట్లకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో జర్మనీ సంస్థ నివేదిక.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్కు భారీ నష్టాలకు గురిచేసినట్లు తెలుస్తోంది.