రుద్రాక్షలతో శివలింగం...సాంబశివుడికి ప్రీతిపాత్రం
చిత్తూరు జిల్లా: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలం మల్లప్పకొండపై వినూత్నంగా రుద్రాక్షల శివలింగం ఏర్పాటు చేశారు. 14 అడుగుల ఈ రుద్రాక్ష శివలింగాన్ని ఏర్పాటు చేసేందుకు సుమారు 2.25 లక్షల రుద్రాక్షలను వినియోగించారు. శివుడికి రుద్రాక్షలు అత్యంత ప్రీతిపాత్రమైనవిగా భక్తులు భావిస్తారన్న సంగతి తెలిసిందే.
మల్లప్పకొండపై ఏటా నిర్వహించే శివరాత్రి మహోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. స్థానికులు, చుట్టు ప్రక్కల ప్రాంతాల వారే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన సుమారు 50,000 మంది భక్తులు మల్లప్పకొండపై నిర్వహించే రుద్రాభిషేకంలో పాల్గొంటారని అంచనా వేస్తున్నట్టు దేవాలయ వర్గాలు వెల్లడించాయి.
రుద్రాక్ష అంటే...శ్రీ రుద్రుడికి చాలా ఇష్టం
రుద్రాక్ష అంటే శివుడికి మహా ఇష్టంగా భక్తులు భావిస్తారు. అందుకే శివుడు నిత్యం రుద్రాక్షలు ధరించే ఉంటాడంటారు. అందుకే శివుడిని ఆరాధించేవారు కూడా రుద్రాక్షమాలలు ధరించి ఉంటారు. అందుకే శివభక్తులకు సంబంధించి రుద్రాక్షలు ఇంతటి ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి.
అసలు రుద్రాక్ష... ఎలా వస్తుందంటే...
అసలు ఈ రుద్రాక్షలు ఎలా ఉద్భవించాయనే దానికి ఒక కధ కూడా వుంది. రుద్రాక్షలు చెట్టునుండి వస్తాయని మనకు తెలిసిందే. శివుడి తినేత్రాలనుండి రాలిన కన్నీటి బిందువులు నేలపై పడి రుద్రాక్ష మొక్కలుగా అవతరించాయట. మొత్తం 38 రకాల రుద్రాక్ష మొక్కలు మొలిచాయట. వాటినే మనం వివిధ ముఖాలు కలిగిన రుద్రాక్షలను చూస్తున్తామని పురాణాలు చెబుతున్నాయి.
సైన్స్ పరంగా కూడా...ఎన్నో ప్రయోజనాలు...
రుద్రాక్షలు ధరించడం వెనుక ఆధ్యాత్మికంగానే కాకుండా.. ఆరోగ్యపరంగా కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయట. రుద్రాక్ష గురించి శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేశారు. రుద్రాక్షల వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. రుద్రాక్షల్లో మాగ్నటిక్ పవర్ ఉంటుంది...ఇది శరీరంలోకి ప్రవేశించి విద్యుత్ ప్రసరణ సజావుగా జరిగే విధంగా చేస్తుంది...రక్త ప్రసరణ సరిగ్గా జరిగితే గుండె సంబంధిత వ్యాధులు రాకుండా అరికట్టవచ్చట. రుద్రాక్ష శరీరం మీద ఉండడం వల్ల హానికారమైన క్రిములను నాశనం చేస్తుందని...అంతే కాదు కంటికి సంబందించిన సమస్యలున్నా.. చర్మవ్యాధులు ఉన్న రుద్రాక్షలు ధరించడం వలన ఇబ్బందులు తొలగుతాయని చెపుతున్నారు.నేపాల్ లో లభించే రుద్రాక్షలు ధరించడం వలన హృద్రోహము, రక్తపోటు, బ్రెయిన్ హేమరేజ్ అనేక చర్మరోగాలు దూరం అవుతాయని సైన్స్ ద్వారా నిరూపణ జరిగింది.
వేడుకల కోసం...సన్నద్దం...
మహాశివరాత్రి వేడుకలకు రాష్ట్రంలోని శైవక్షేత్రాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. శ్రీకాళహస్తి, శ్రీశైలం, ద్రాక్షారామం, కోటప్పకొండలతో పాటు పంచారామాలుగా ప్రసిద్ది చెందిన ఐదు శైవ క్షేత్రాలు అమరావతి లోని అమరారామము, భీమవరం లోని సోమారామము, పాలకొల్లు లోని క్షీరారామము, తూర్పు గోదావరి జిల్లా లోని ద్రాక్షారామము మరియు సామర్లకోట లోని కుమారారామముల్లో ఈ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.