బాబుకు ఊరట, జగన్కు మింగుడుపడని 'భూమా'!: కార్పోరేషన్ కోసం పావులు
ఈ ఏడాది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు అధికార టిడిపిలో చేరారు. మూడు రోజుల క్రితం ఉప్పులేటి కల్పన సైకిల్ ఎక్కారు. ఆమెతో కలిపి మొత్తం 21 మంది ఎమ్మెల్యేలు టిడిపి పంచన చేరారు.
కర్నూలు: ఈ ఏడాది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు అధికార టిడిపిలో చేరారు. మూడు రోజుల క్రితం ఉప్పులేటి కల్పన సైకిల్ ఎక్కారు. ఆమెతో కలిపి మొత్తం 21 మంది ఎమ్మెల్యేలు టిడిపి పంచన చేరారు.
మరికొద్ది రోజుల్లో తనదే అధికారం అని భావిస్తున్న వైసిపి అధినేత వైయస్ జగన్కు సొంత ఎమ్మెల్యేలు ఈ ఏడాది వరుసగా షాకిచ్చారు. దాదాపు అన్ని జిల్లాల నుంచి ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. కర్నూలు జిల్లాలో ఐదుగురు ఎమ్మెల్యేలు టిడిపిలో చేరడం ఆ జిల్లా రాజకీయాలను మలుపు తిప్పాయి.
2016 రివైండ్: బీజేపీకి చంద్రబాబు సర్ప్రైజ్, ఎదురుతిరిగిన పవన్, జగన్ కార్నర్
కర్నూలు జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 11 నియోజకవర్గాల్లో వైసిపి జెండా ఎగిరింది. అలాగే రెండు పార్లమెంటు స్థానాలు ఉంటే రెండూ వైసిపినే గెలుచుకుంది. అయితే, ఈ ఏడాది జిల్లాలో జరిగిన పరిణామాలు జగన్కు ఏమాత్రం మింగుడు పడని అంశాలే.
2014 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన భూమా నాగిరెడ్డి, ఆ తర్వాత ఉప ఎన్నికల్లో గెలిచిన ఆయన కూతురు భూమా అఖిల ప్రియ ఈ ఏడాది టిడిపిలో చేరారు. వైసిపిలో చేరినప్పటి నుంచి జగన్కు భూమా కుటుంబం నమ్మకంగా ఉంటూ వస్తోంది. అలాంటి భూమా టిడిపిలో చేరడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
వారితో పాటు ఎస్వీ మోహన రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ, శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి టిడిపిలో చేరారు. దీంతో వైసిపి బలం జిల్లాలో 11 నుంచి ఆరుకు పడిపోయింది. కర్నూలు కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటి, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఝలక్ ఇవ్వాలని వైసిపి ఎదురు చూస్తోంది.
అదే సమయంలో కార్పోరేషన్ ఎన్నికల్లో గెలిచి తమ సత్తా చాటాలని టిడిపి భావిస్తోంది. ఎప్పటి నుంచో లోలోపల అసంతృప్తితో సాగుతున్న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఒకటి రెండుసార్లు పార్టీ అధినేతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లా టిడిపిలో ప్రదానంగా మూడు వర్గాలు ఉన్నాయి. ఎవరికి వారు పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇవి తమకు లబ్ధి చేకూరుస్తాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.