ఉద్యోగ సంఘాల నేతలపై తీవ్ర ఒత్తిడి-సర్కారా, ఉద్యోగులా ? -ఏదో ఒకటి తేల్చుకోవాల్సిందే
ఏపీలో ఉద్యోగుల పీఆర్సీ వ్యవహారం ఉద్యోగ సంఘాల నేతల మెడకు చుట్టుకోబోతోంది. ఇప్పటివరకూ ఉద్యోగుల కోసం పోరాడుతున్నట్లు చెప్పుకుంటూ ప్రభుత్వం చెప్పినట్లు విన్న నేతలంతా ఇప్పుడు తాజా జీవోలతో ఇరుకునపడ్డారు. ఉద్యోగుల జీతాలు తగ్గుతాయన్న ఆందోళనలతో ఇన్నాళ్లూ ప్రభుత్వాన్ని మోసిన నోళ్లతోనే ఇప్పుడు విమర్శించాల్సిన పరిస్ధితులు తలెత్తుతున్నాయి. అంతే కాదు మా కోసం పోరాటాలు చేయని నేతలు మాకెందుకన్న వాదన ఉద్యోగుల్లో మొదలైంది.
ఉద్యోగుల పీఆర్సీ చిచ్చు
ఏపీలో ఉద్యోగుల పీఆర్సీ వ్యవహారం చిచ్చు రేపుతోంది. పీఆర్సీ ఫిట్ మెంట్ ను ఐఆర్ 27 శాతం కంటే తగ్గించి 23 శాతానికి ఎప్పుడైతే ఖరారు చేశారో అప్పుడే ఉద్యోగుల్లో అనుమానాలు మొదలయ్యాయి. అయినా ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించి దాన్ని సమర్ధించారు. చివరికి ప్రభుత్వం ఇచ్చిన జీవోల్లో విధించిన హెచ్ఆర్ఏ కోతలు, సీసీఏ తొలగింపు ద్వారా పెరగాల్సిన జీతాలు కాస్తా తగ్గే పరిస్ధితి వచ్చే సరికి వారంతా ఆత్మరక్షణలో పడిపోయారు. దీంతో నిన్న మొన్నటివరకూ ప్రభుత్వాన్ని పొగిడిన నేతలే ఇప్పుడు సర్కార్ ను టార్గెట్ చేయక తప్పని పరిస్దితికి వచ్చేశారు.
పెరగాల్సిన జీతం తగ్గేసరికి
ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ కోరుకునేదే జీతాలు భారీగా పెరుగుతాయని, అదీ ఐదేళ్లకోసారి ఇచ్చే పీఆర్సీ ద్వారా జీతాల పెంపు కోసం ఆ ఐదేళ్లు చకోర పక్షుల్లా ఎదురుచూస్తుంటారు. అలాంటిది ఐదేళ్లకోసారి పీఆర్సీ రాకపోగా., ఇప్పుడు ఆలస్యంగా వచ్చిన పీఆర్సీతో జీతాలు తగ్గుతాంటే వారి ఆగ్రహం ఏ స్ధాయిలో ఉంటుందో ఓ సారి అర్దం చేసుకోవచ్చు.
ఇదే ఇప్పుడు ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమవుతోంది. ప్రభుత్వంపై ఆగ్రహం కంటే తమను మోసం చేశారంటూ ఉద్యోగ సంఘాల నేతలపైనే ఎక్కువగా ఉద్యోగుల నుంచి ఆగ్రహజ్వాలలు ఎగసిపడుతున్నాయి.
నేతలకు ఉద్యోగుల సెగ
ఇన్నాళ్లూ ఉద్యోగ సంఘాల నేతల్ని తమ ప్రయోజనాల కోసం పనిచేస్తారని ఎన్నుకున్న నేతలు ఇప్పుడు కాస్తా కాడి కింద పడేసి ప్రభుత్వం చెప్పినట్లల్లా ఆడుతుండటంతో ఉద్యోగుల్లో ఆక్రోశం పెరుగుతోంది. తాజాగా ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై ఆగ్రహంగా ఉన్న ఉద్యోగులు దీనికి ప్రధాన కారణం ఉద్యోగ సంఘాల నేతలే అని భావిస్తున్నారు.
ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకోవాల్సిన నేతలు కాస్తా లొంగిపోవడమే ఇందుకు కారణంగా వారు భావిస్తున్నారు. దీంతో ఉద్యోగ సంఘాల నేతల్ని ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. తమ ప్రయోజనాల కోసం పోరాడటం చేతకాకుంటే సంఘాల్ని రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నారు. దీంతో వారికేం సమాధానం చెప్పాలో తెలియక ఉద్యోగ నేతలు నీళ్లు నములుతున్నారు.
Recommended Video
సర్కారా ? ఉద్యోగులా
ఐదేళ్ల పాటు ఉండే ప్రభుత్వాల కోసం ఉద్యోగుల జీవితకాల ప్రయోజనాల్ని తాకట్టు పెడుతున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న ఉద్యోగ సంఘాల నేతలపై ఆగ్రహం అంతకంతకూ పెరుగుతోంది. దీంతో ఉద్యోగులు కావాలా సర్కారు కావాలా తేల్చుకోవాలని వారి మొహం మీదే చెప్పేస్తున్న పరిస్ధితి. దీంతో ఉద్యోగుల్ని సముదాయించడం వారి వల్ల కావడం లేదు.
సర్కార్ ను ఇంకా సమర్ధిస్తే తమ పదవుల్లో కొనసాగడం కూడా కష్టమే. అలాగని ఉద్యోగుల్ని సమర్ధిస్తే ప్రభుత్వానికి కోపం వస్తుంది. అప్పుడు అసలుకే మోసం వస్తుందన్న భావన ఉద్యోగ సంఘాల నేతల్లో ఉంది. అన్నింటికీ మించి ఈ ప్రభుత్వంలో ఉద్యోగ సంఘాలు తమ కోసం ఏదో చేస్తాయన్న భావనలో నుంచి ఉద్యోగులు బయటికి వచ్చేస్తుండటం అన్నింటికీ మించిన కీలక పరిణామం. ఇదే పరిస్ధితి కొనసాగితే సంఘాలతో, నేతలతో సంబంధం లేకుండా ఉద్యోగులు రోడ్డెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.