Bigg Boss: సీజన్-3ని వదలని కేసులు.. క్యాస్టింగ్ కౌచ్ , అశ్లీలం.. ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు..!!
అమరావతి: బిగ్ బాస్ తెలుగు సీజన్-3ని కేసులు వదలట్లేదు. ఈ రియాలిటీ షో కార్యక్రమాన్ని వెంటనే నిలిపివేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వాజ్యం దాఖలైంది. నిర్మాత, తమిళనాడులోని తెలుగు యువశక్తి సంఘం అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి దాఖలు చేసిన ఈ పిటీషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఇందులో ప్రతివాదులుగా కేంద్ర ప్రభుత్వం, సమాచార ప్రసారాల మంత్రిత్వశాఖ, కేంద్రీయ సెన్సార్ బోర్డు చైర్ పర్సన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, దీన్ని ప్రసారం చేస్తోన్న ఛానల్ యాజమాన్యం, హోస్ట్గా వ్యవహరిస్తోన్న ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జునలను ప్రతివాదులుగా చేర్చారు.
యడ్డియూరప్ప ప్రమాణం..నాలుగోస్సారి! ఈ సారైనా కుదురుకునేనా?
ఇదివరకు హైదరాబాద్ హైకోర్టులో కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఓ పిల్ను దాఖలు చేశారు. అది సోమవారం విచారణకు రానుంది. బిగ్బాస్ తెలుగు సీజన్ 3 ప్రసారాలను నిలిపివేయాలని కోరుతూ తాను పిల్ దాఖలు చేశానని కేతిరెడ్డి తెలిపారు. బిగ్బాస్ హౌస్ కోసం ఎంపిక చేసే కంటెస్టెంట్ల ఎంపికలో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ఈ రియాలిటీ షో భారతీయ సంస్కృతిని సంప్రదాయలను మంట కలిపే విధంగా ఉన్నాయని ఆయన విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు వెంటనే దీన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. రియాలిటీ షో పేరుతో అశ్లీల కార్యక్రమాలను బహిరంగంగా, ప్రతి గడపకూ అందిస్తున్నారని విమర్శించారు.
ఇదివరకు ఈ షోను నిలిపివేయాలని కోరుతూ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులోనూ ఓ పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీన్ని విచారణకు స్వీకరించింది ఆ రాష్ట్ర హైకోర్టు. సోమవారం దీనిపై విచారణ చేపట్టనుంది. ఆయనతో పాటు యాంకర్ శ్వేతా రెడ్డి, సినీ నటి గాయత్రి గుప్తా వేర్వేరుగా ఈ కార్యక్రమ నిర్వాహకులపై కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్లోని బంజారాహిల్స్, రాయదుర్గం పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు నమోదయ్యాయి.