నీతి అయోగ్: బాబు మాట్లాడుతుంటే అడ్డుకున్న రాజ్నాథ్, నితీష్-మమతల మద్దతు
న్యూఢిల్లీ: నీతి అయోగ్ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు ఆదివారం ఏపీ సమస్యలను ప్రస్తావించారు. ఇరవై నిమిషాల పాటు ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన ఏకపక్షంగా జరిగిందన్నారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలన్నారు. ఏపీ రెవెన్యూ లోటును వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఏపీ సేవారంగ వృద్ధిని పరిగణలోకి తీసుకోవాలన్నారు. అమరావతి నిర్మాణానికి నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో ఆయన నోట్ల రద్దు, జీఎస్టీ సమస్యలను ప్రస్తావించారు. 15వ ఆర్థిక సంఘం తీరును చంద్రబాబు తప్పుబట్టారు. రైతులకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు.
భేటీలో మోడీపై చంద్రబాబు ఆగ్రహం, 'ఇక ఏ ముఖ్యమంత్రికైనా ఇలాగే మద్దతు'
చంద్రబాబు ప్రసంగాన్ని అడ్డుకున్న రాజ్నాథ్
చంద్రబాబు నీతి అయోగ్ సమావేశంలో కేంద్రాన్ని నిలదీశారు. రైల్వే జోన్ హామీ ఇప్పటికీ నెరవేరలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు జీఎస్టీ విఘాతం కలిగించిందన్నారు. జిఎస్టీతో స్థానికంగా పన్నులు విధించే వెసులుబాటు లేకుండా పోయిందన్నారు. నగదు కొరత సమస్యను కేంద్రం ఇంకా పరిష్కరించలేదన్నారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే సమానస్థాయికి వచ్చే వరకు ఏపీకి చేయూతనివ్వాలన్నారు. పదేళ్ల పాటు హోదా ఇవ్వాలని అడిగింది బీజేపీనే అని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రసంగిస్తుండగా మధ్యలో ఏడు నిమిషాల తర్వాత కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అడ్డుకున్నారు. ఇచ్చిన సమయం ముగిసిందని చెప్పారు.
ఏపీకి ప్రత్యేక హోదాకు నితీష్ కుమార్ మద్దతు
నీతి అయోగ్ సమావేశంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. దీనికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మద్దతు పలికారని తెలుస్తోంది. బీహార్ రాష్ట్రానికి కూడా వారు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన చంద్రబాబు డిమాండుకు మద్దతు పలికారు.
ప్రధానితో చేయి కలిపిన చంద్రబాబు
నీతి అయోగ్ సమావేశం సందర్భంగా ప్రధాని మోడీని ఏపీ సీఎం చంద్రబాబు, కర్ణాటక సీఎం కుమారస్వామిలు కలిశారు. ఆయనతో చేయి కలిపారు. కుమారస్వామి, చంద్రబాబులు నవ్వుతూ ప్రధానమంత్రితో చేయి కలిపారు.
చంద్రబాబుకు మమతా బెనర్జీ మద్దతు
కేంద్ర పన్నుల ఆదాయాన్ని రాష్ట్రాలకు పంపిణీ చేసే నిష్పత్తిని నిర్ణయించడానికి 15వ ఆర్థిక సంఘం 2011 జనాభా గణాంకాలను ప్రాతిపదికగా ఉపయోగించుకోవాలని సూచించింది. దీనిపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు అభ్యంతరానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మద్దతు తెలిపారు.
సమస్య పరిష్కరించాలని కోరాం
ఢిల్లీ ప్రభుత్వం సమస్యలు ఏమిటో వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, కర్ణాటక సీఎం కుమారస్వామిలతో కలిసి తాను ప్రధాని నరేంద్ర మోడీని కోరానని మంతా బెనర్జీ చెప్పారు.