బిహార్ ఎఫెక్ట్: మోడీపై గొంతు పెంచుతున్న టిడిపి, వీర్రాజుకు పురంధేశ్వరి సహా అండ!
అమరావతి: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓటమి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు కమలం పార్టీ నేతల పైన గొంతు పెంచుతున్నట్లుగా కనిపిస్తోంది. ప్రత్యేక హోదా సహా పలు అంశాల పైన టిడిపి - బిజెపి నాయకుల మధ్య గత కొద్ది రోజులుగా మాటల తూటాలు పేలుతున్న విషయం తెలిసిందే.
బిజెపి నేతలు సోము వీర్రాజు, పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు తెలుగుదేశం పార్టీ నేతల పలుమార్లు పైన విమర్శలు గుప్పించారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో టిడిపి నేతలు బిజెపిని ప్రశ్నించినప్పుడే కాకుండా వివిధ సందర్భాల్లో కమలం పార్టీ నేతలు టిడిపిని, సీఎం చంద్రబాబును టార్గెట్ చేశారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, పలు హామీలను కేంద్రం ఇచ్చింది. వాటిని బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే కూటమి నెరవేర్చవలసి ఉంది. వీటిపై బిజెపి, టిడిపి నేతల మధ్య పలుమార్లు మాటల యుద్ధం సాగింది.
విభజన అనంతరం ఏపీ ఆర్థిక లోటులో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఆసరా ఏపీకి అవసరం. దీంతో, బిజెపి నేతలు ఏం అన్నా సర్దుకుపోదామని ఏపీ సీఎం చంద్రబాబు టిడిపి నేతలకు సూచించినట్లుగా పలుమార్లు వార్తలు వచ్చాయి.
చంద్రబాబు పాలన బాగా లేదని, ప్రాజెక్టుల్లో అక్రమాలు జరిగాయని, కేంద్రం చేస్తున్న సాయాన్ని ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం వివరించలేకపోతోందని... ఇలా పలు సందర్భాల్లో బిజెపి నేతలు చంద్రబాబును నిలదీసిన సందర్భాలు ఉన్నాయి.
చంద్రబాబు సూచన నేపథ్యంలో కొన్ని సందర్భాల్లో టిడిపి నేతలు ఘాటుగా స్పందించినప్పటికీ, ఎక్కువ సందర్భాల్లో ఆచితూచి స్పందించేవారు. ఏపీకి కేంద్రం సాయం అవసరమైన నేపథ్యంలోనే టిడిపి నేతలను చంద్రబాబు వారించేవారని చెబుతున్నారు.
ఇన్నాళ్లు టిడిపి - బిజెపి వాగ్యుద్ధంలో కమలం పార్టీ నేతలదే ఒకింత పైచేయిగా కనిపించేది. కానీ, బీహార్ ఎన్నికల్లో బిజెపి ఓటమి నేపథ్యంలో టిడిపి నేతలు మరింత గొంతు పెంచుతున్నట్లుగా కనిపిస్తోంది. అందుకు ఎంపీ రాయపాటి సాంబశివ రావు వ్యాఖ్యలే నిదర్శనం అంటున్నారు. ప్రధాని మోడీకి ఏపీ ఉసురు తగిలిందని రాయపాటి ఘాటుగా స్పందించారు. ఇది బిజెపి, టిడిపిల్లో చర్చనీయాంశమైంది.
కాగా, టిడిపి అండతో ఎమ్మెల్సీగా ఎన్నికైన సోము వీర్రాజు.. తరుచూ తమ పార్టీ పైన విమర్శలు చేస్తున్నారని కొద్ది రోజులుగా టిడిపి నేతలు అసహనంతో ఉన్నారు. ఆయనకు మద్దతుగా బిజెపిలో చేరిన కాంగ్రెస్ మాజీ నేతలు కావూరి సాంబశివ రావు, పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ వంటి వారు కూడా గొంతు కలపడంతో టిడిపి - బిజెపి మధ్య విభేదాలు ముదురుతున్నాయని అంటున్నారు.