ఏపీ సంక్రాంతిపై బర్డ్ఫ్లూ దెబ్బ- పందెం కోళ్ల బెంబేలు- నాన్వెజ్ ప్రియులకూ తప్పని నిరాశ
ఏపీలో సంక్రాంతి వస్తుందంటే చాలు ఓవైపు కోడి పందాలు, మరోవైపు చికెన్ వంటకాలు తప్పనిసరి. ప్రతీ ఏటా వందల కోట్ల వ్యాపారం సాగుతుంటుంది. కానీ ఈసారి బర్డ్ఫ్లూ భయాలు కోళ్లను వెంటాడుతుండటం అటు సంక్రాంతి సంబరాలపైనే కాదు నాన్ వెజ్ ప్రియులకూ ఇబ్బందికరంగా తయారయ్యాయి. సంక్రాంతి కోసం ఏడాది పొడవునా పెంచుకున్న కోళ్లను సిద్ధం చేస్తున్న వాటి యజమానులు ఈ బర్డ్ఫ్లూ ఎక్కడ సోకుతుందో అన్న భయాలతో గడుపుతుండగా.. తాజా వైరస్తో చికెన్ వంటకాలు మాయమవుతున్నాయి.
సంక్రాంతిపై బర్డ్ఫ్లూ దెబ్బ
ఏపీలో కరోనా కాస్త తగ్గుముఖం పడుతుందని భావిస్తున్న వేళ బర్డ్ఫ్లూ ప్రభావం అక్కడక్కడా కనిపిస్తోంది. ఫ్లూ ప్రభావంతో పలు చోట్ల వందల సంఖ్యలో కోళ్లు చనిపోతున్న వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పౌల్ర్టీ రంగాన్ని నమ్ముకున్న వాళ్లకు ఈ సంక్రాంతి పీడకలగా మారే పరిస్ధితి కనిపిస్తోంది. తాజాగా బర్డ్ఫ్లూ సోకిన కారణంగా కోళ్లు చనిపోతుండటంతో ఈ ప్రభావం మరికొన్నాళ్లు హేచరీలపై ఉంటుందనే భయాలు నెలకొన్నాయి. దీంతోపాటు ఊళ్లలో ఫ్లూ భయాలతో పడిపోయిన డిమాండ్ కూడా వారిని నిద్రలేకుండా చేస్తోంది. మరోవైపు సంక్రాంతి కోళ్లకు కూడా ఈ వైరస్ ఎక్కడ సోకుతుందో అని వాటి యజమానులు బెంబేలెత్తుతున్నారు. సహజంగానే ఈ పరిణామాలు సంక్రాంతి సంబరాలపై పడుతున్నాయి.
సంక్రాంతి కోళ్ల బెంబేలు
ఈ ఏడాది సంక్రాంతి సంబరాల్లో భాగంగా సంప్రదాయంగా నిర్వహించే కోడి పందాలకు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. హైకోర్టు ఆంక్షలు ఉన్నా ప్రజాప్రతినిధుల సాయంతో ఈసారి కూడా కోడి పందాల నిర్వహణకు వారు సిద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలో కోళ్లకు బర్డ్ఫ్లూ వైరస్ సోకుతుందన్న భయాలతో వాటి యజమానులకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఎందుకంటే ఈ పందాల కోసం ఏడాది పొడవునా కోళ్లపై లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ఉంటారు. ఓసారి ఫ్లూ సోకి కోడి చనిపోతే వారికి భారీగా నష్టం తప్పదు. ఇలా భారీ సంఖ్యలో కోళ్లు చనిపోతే ఇక సంక్రాంతి సంబరాలు కళ తప్పడం ఖాయంగా కనిపిస్తోంది.
నాన్ వెజ్ ప్రియులకూ నిరాశ
బర్డ్ఫ్లూ భయాలతో హోటళ్లలోనే కాదు ఇళ్లకు కూడా కోడి మాంసం తెచ్చుకుని తినేవారు కరువయ్యారు. నిన్న మొన్నటి వరకూ కేజీ 200 రూపాయలు పలికిన ధర 100 రూపాయలకు దిగి వచ్చినా కొనే వారు లేరు. రోజూ భారీగా కోళ్లను కొనుగోలు చేసే హోటళ్ల యాజమనులు కూడా ఇప్పుడు డిమాండ్ తగ్గిపోవడంతో ఆ మేరకు కొనుగోళ్లు తగ్గించేశారు. హోటళ్లలో కోడి మాంసం నిల్వ చేసి అమ్మే అవకాశం ఉండటంతో నాన్ వెజ్ ప్రియులు ఇప్పుడు హోటళ్లకు వెళ్లడం తగ్గించేశారు. దీంతో సంక్రాంతి సీజన్లో భారీగా అమ్మకాలు ఉంటాయని ఆశించిన హోటల్ యజమానులు కూడా తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. అటు ఇళ్లకు తెచ్చుకునే మాంసం విక్రయాలు కూడా భారీగా తగ్గిపోయాయి.
సర్కారు ప్రకటనలను నమ్మని జనం
ఏపీలో బర్డ్ఫ్ల ప్రభావం లేదని పశుసంవర్ధకశాఖ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. మన కోళ్లకు బర్డ్ఫ్లూ సోకలేదని చెబుతోంది. అయినా రోజూ రాష్ట్రంలో ఎక్కడో చోట భారీగా కోళ్లు చనిపోయాయన్న వార్తలు కనిపిస్తున్న తరుణంలో ఈ ప్రకటనలను జనం నమ్మడం లేదు. బర్డ్ఫ్లూ వచ్చినట్లు ఎక్కడా నిర్ధారణ కాకపోయినా భారీ సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడటంతో ఈ భయాలు పెరుగుతున్నాయి. సంక్రాంతి సీజన్లో ఇళ్లలో కోడి మాంసం తెచ్చుకోవాలన్నా బర్డ్ఫ్లూ భయాలే ఉన్నాయి. ప్రభుత్వం కోడి మాంసం తినొచ్చని, ఎలాంటి ఇబ్బందులు లేవని చెబుతోంది. అయినా ఈ ప్రకటనలు వారిలో విశ్వాసం నింపలేకపోతున్నాయి.