దీక్ష ఆగదు, నా డెడ్ బాడీని చూస్తారు: కేంద్రమంత్రికి తేల్చిచెప్పిన సీఎం రమేష్
కడప/న్యూఢిల్లీ: కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరుతూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న టీడీపీ ఎంపీ సీఎం రమేష్కు కేంద్రమంత్రి బీరేంద్ర సింగ్ గురువారం సాయంత్రం ఫోన్ చేశారు. ఆమరణ దీక్ష విరమించాలని ఆయన కోరారు.
Recommended Video
ఉక్కు పరిశ్రమ ఎంపీలతో చర్చిస్తున్నామని తెలిపారు. దీనికి ఎంపీ సీఎం రమేష్ స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు తాను దీక్ష కొనసాగిస్తానని చెప్పారు. తాను గత 9రోజులుగా దీక్షను కొనసాగిస్తున్నానని, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా.. ఉత్తర్వులు లేకుండా దీక్ష ఎలా విరమించమంటారని కేంద్రమంత్రిని రమేష్ ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం
కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన వసతులన్నీ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రమేష్ చెప్పారు. గురువారం ప్రభుత్వం లేఖ కూడా ఇచ్చిందన్నారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు 3వేల ఎకరాల భూమి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
ప్రజల సెంటిమెంటు
కడప చాలా వెనుకబడిన జిల్లా అని, ఉక్కు పరిశ్రమ ప్రజల సెంటిమెంట్కు సంబంధించినదని చెప్పారు. అందువల్ల ఈ అంశాన్ని రాజకీయ కోణంలో చూడకుండా తక్షణమే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కోరారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వ సమాచారాన్ని మెకాన్ సంస్థకు అందజేయాలని కేంద్రమంత్రి సూచించారు.
నా డెడ్ బాడీని చూస్తారు: రమేష్
ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసి ఆ క్రెడిట్ కేంద్రమే తీసుకోవాలని, తమకెలాంటి క్రెడిట్ అవసరం లేదని కేంద్రమంత్రికి రమేష్ తెలిపారు. పరిశ్రమ ఏర్పాటు చేస్తే కేంద్రంలోని బీజేపీకే మంచి పేరు వస్తుందని చెప్పారు. రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోకపోతే తన డెడ్ బాడీని చూస్తారని బీరేంద్ర సింగ్తో రమేష్ వ్యాఖ్యానించారు.
కేంద్రమంత్రికి ధన్యవాదాలు
ప్రజల పరిస్థితిని అర్థం చేసుకొని ప్రధానితో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రమంత్రికి రమేష్ విజ్ఞప్తి చేశారు. తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ తనకు ఫోన్ చేసినందుకు కేంద్రమంత్రికి సీఎం రమేష్ ధన్యవాదాలు తెలిపారు. తాను రాష్ట్ర ప్రజల కోసం ఆందోళన చెందుతున్నానని చెప్పారు.