చేదుఅనుభవం: బాధపడ్డ చిరంజీవి, బొత్స, అధికారులే..
రాజమండ్రి: మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత చిరంజీవి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ మాజీ అధ్యక్షులు, మాజీ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణలకు ఆదివారం చేదు అనుభవం ఎదురయింది. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గ్యాస్ పైప్ లైన్ పేలుడు ఘటనలో బాధితులను పరామర్శించేందుకు చిరు, బొత్సలు వెళ్లారు.
ఈ సమయంలో స్థానికులు వారిని అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వారిని పోలీసులు అదుపు చేశారు.
బాధపడిన చిరు, బొత్స
గ్యాస్ పైప్ లైన్ ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం చిరంజీవి మాట్లాడారు. ఇది మానవ తప్పిదం అన్నారు. మనుషులు చేసిన తప్పిదానికి సామాన్యులు శాపగ్రస్థులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు భద్రతాచర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యమే అన్నారు. కొబ్బరి చెట్లు కోల్పోయిన వారికి ఐదేళ్ల పాటు నష్టపరిహారం ఇవ్వాలని, ఇళ్లు కోల్పోయిన వారికి పక్కా ఇళ్లు కట్టివ్వాలని చిరు డిమాండ్ చేశారు.
కాగా, గ్యాస్ పైప్ లైన్ ప్రమాద ప్రాంతాన్ని శనివారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సందర్శించి బాధితులను పరామర్శించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయంత్రం కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్తో కలిసి సందర్శించి బాధితులను పరామర్శించారు.