ముగ్గురు మాజీ మంత్రులకి బొత్స షాక్, గదికే పరిమితం
విశాఖ: మాజీ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ కారణంగా ముగ్గురు మాజీ మంత్రులు, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేతలకు భంగపాటు ఎదురయిందట. విశాఖలోని కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో సిఎం విడుదల చేయనున్న శ్వేతపత్రాల పరిశీలనకు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షతన శనివారం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ మేరకు ఆయన యల్లమ్మతోట కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రులు బాలరాజు, వట్టి వసంత్ కుమార్లతో పాటు ద్రోణంరాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తల సమావేశం అనంతరం విలేకరుల సమావేశం మొదలు పెట్టేందుకు వారు సిద్ధమవుతుండగా.. బొత్స సత్యనారాయణ అక్కడకు వచ్చారు. సమావేశంలో కూర్చున్న వారితో కొంతసేపు మాట్లాడారు. అనంతరం ఆయన సమావేశ గది నుండి బయటకు వచ్చి విలేకరులతో బెహరా, పేడాడతో కలిసి ఆయన ఒక్కరే సమావేశం నిర్వహించారు.
సమావేశానికి కన్నా, బాలరాజు, వసంత్ కుమార్లను దూరంగా పెట్టారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో వారంతా బొత్స పైన అసంతృప్తితో అక్కడి నుండి వెళ్లిపోయేందుకు బయటకు వచ్చారు. అది గమనించిన బొత్స వారిని లోపలకు వెళ్లిపోవాలని సూచించారట. దీంతో వారు కక్కలేక మింగలేక గదికే పరిమితమయ్యారట.