తిరగబడిన సుబాబుల్ రైతులు.. మంత్రి లోకేశ్కు చేదు అనుభవం
ఐటీ, పంచాయతీ శాఖ మంత్రి నారా లోకేశ్కు చేదు అనుభవం ఎదురైంది. తమకు న్యాయం చేయాలంటూ మంగళవారం మంత్రి లోకేశ్ను కలిసిన గుంటూరు, కృష్ణాజిల్లా సుబాబుల్ రైతులు ఓ దశలో ఆయనపైనే విరుచుకుపడ్డారు.
విజయవాడ: ఐటీ, పంచాయతీ శాఖ మంత్రి నారా లోకేశ్కు చేదు అనుభవం ఎదురైంది. తమకు న్యాయం చేయాలంటూ మంగళవారం మంత్రి లోకేశ్ను కలిసిన గుంటూరు, కృష్ణాజిల్లా సుబాబుల్ రైతులు ఓ దశలో ఆయనపైనే విరుచుకుపడ్డారు.
మూడేళ్లుగా తమ డబ్బుల కోసం మార్కెట్ యార్డ్ చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ, రేపు డబ్బులు ఇస్తామని తిప్పుతున్నారంటూ రైతులు ఆవేదన చెందారు.
310 మంది రైతులకు సుమారు రూ.10 కోట్లు వరకూ రావాలని వారు తెలిపారు. డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు కంటతడి పెట్టారు. అయితే తమ బాధలు చెప్పుకుంటున్న రైతులపై మంత్రి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొంత సమయం ఓపిక పట్టాలని ఆయన రైతులకు సూచించగా.. ఇంకెంతకాలం తాము ఓర్పుగా ఉండాలని రైతులు కూడా మంత్రి లోకేశ్ను సూటిగా ప్రశ్నించారు. మూడేళ్లపాటు తాము ఓపిక పట్టామని, ఇంకా ఎంత కాలం ఓపిక పట్టమంటారని వారు ప్రశ్నించడంతో లోకేశ్ కంగుతిన్నారు.