టిడిపి ఎమ్మెల్యే సౌమ్యకు చేదు అనుభవం, ఎందుకని అసహనం
విజయవాడ: కృష్ణా జిల్లా నందిగామ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు సోమవారం నాడు చేదు అనుభవం ఎదురైనట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.
మంత్రులు, టిడిపి ఎమ్మెల్యేలు కూడా ఆయా ప్రాంతాల్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే సౌమ్య కంచికచర్లలో ఏర్పాటు చేసిన ఏరువాక కార్యక్రమానికి హాజరయ్యారు. కానీ ఎవరూ హాజరు కాలేదని తెలుస్తోంది. దీంతో ఆమె అసహనానికి లోనయ్యారని అంటున్నారు.
ఏరువాక కార్యక్రమానికి రైతులు రాకపోవడం ఏమిటని, ఎందుకు రాలేదని ఆమె అధికారులను నిలదీశారు. దీనికి వారి వద్ద నుంచి ఎలాంటి సమాచారం లభించలేదని తెలుస్తోంది. కాగా, ఏరువాక కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రభుత్వం కమిటీలు వేసింది.
విజయవాడ చేరుకున్న సురేష్ ప్రభు
కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు సోమవారం గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. ఆయనకు బీజేపీ ఏపీ అధ్యక్షులు హరిబాబు, మంత్రి కామినేని శ్రీనివాస్, రైల్వే అధికారులు ఘన స్వాగతం పలికారు. రాత్రి ఎనిమిదిన్నర గంటలకు ఆయన విజయవాడ-సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ రైలును ప్రారంభించనున్నారు.