పుష్కరాలు: బాలకృష్ణ హల్చల్!, నీళ్లు లేక వైసీపీ ఎమ్మెల్యే బయట స్నానం
విజయవాడ: కృష్ణా పుష్కరాలకు వచ్చిన సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పుష్కర స్నానం అనంతరం కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. ఆయన అమ్మవారిని దర్శించుకున్న సమయంలో ప్రోటోకాల్ పాటించలదని వార్తలు వస్తున్నాయి.
టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నతో కలసి కొండ పైకి సొంత వాహనాల్లో బయలుదేరిన బాలకృష్ణ ఘాట్ ప్రారంభం వద్ద ఉండే టోల్ గేట్ వద్ద ఎలాంటి రుసుము చెల్లించలేదని సమాచారం. కొండ పైకి వెళ్లే వాహనాల్లో వీవీఐపీ ప్రొటోకాల్ పరిధిలో ఉన్నవి మినహా మిగతా వాహనాలన్నీ టోల్ చెల్లించాల్సి ఉంటుంది. దాదాపు ఆరు కార్ల కాన్వాయ్ల్లో టోల్ చెల్లించకుండానే బాలకృష్ణ కొండపైకి వెళ్లిన వెళ్లారు. అధికారులు కూడా దానిని పట్టించుకోలేదంటున్నారు.
బయట స్నానం చేసిన ఆళ్ల
కృష్ణా పుష్కరాలకు వచ్చిన వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి బయట స్నానం చేశారు. దుగ్గిరాల ఘాట్లో నీరు లేకపోవడంతో అతను బయటే స్నానం చేశాడు.
సిసి కెమెరాల్లో పరిశీలిస్తున్న చంద్రబబు
కృష్ణా పుష్కరాల సందర్బంగా యాత్రికుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. శుక్రవారం కృష్ణా పుష్కరాలపై అధికారులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి అఖండ హారతి, కృష్ణమ్మకు పవిత్ర హారతి తెలుగు జాతి చరిత్ర ఉన్నంతవరకు నిలిచిపోతాయన్నారు.
విద్యార్థి వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఘాట్ల వద్ద పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలన్నారు. పుష్కర ఘాట్లను స్వయంగా సందర్శిస్తానని చెప్పారు. ఘాట్లలో పిండప్రదానానికి దేవాదాయ శాఖ చర్యలు తీసుకోవాలన్న బాబు అన్ని ఘాట్లలోకి యాత్రీకులను అనుమతించాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఆయన సీసీ కెమెరాల్లో పుష్కరాలను పరిశీలిస్తున్నారు.
సినీ ప్రముఖులను పిలవలేదా?
కృష్ణా పుష్కరాల కోసం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు భారీ ఏర్పాట్లు చేశాయి. లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. రెండు ప్రభుత్వాలు భారీగా సన్నాహాలు చేస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం దేశవిదేశాల్లోని ప్రముఖులకు ఆహ్వానాలు పంపింది. తమిళనాడులోని తెలుగువారిని మాత్రం విస్మరించిందని అంటున్నారు.
చెన్నైలోని తెలుగు సినీ ప్రముఖులెవరికీ పుష్కర ఆహ్వానాలు అందలేదని తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి. ఏపీ మంత్రి గంటా శ్రీనివాస రావు ఇటీవల చెన్నై వచ్చి డీఎంకే అధ్యక్షులు కరుణానిధికి, ఆయన కుమారుడికి ఆహ్వాన పత్రికలు అందించి వెళ్లారు.
కానీ ఇతర తెలుగు ప్రముఖులకు గానీ, తెలుగు సంస్థలకు గానీ ఎలాంటి ఆహ్వానం పలికినట్లు కనిపించలేదు. చెన్నై నగరంలోనే సుమారు వంద తెలుగు సంస్థలున్నాయి. ఆయా సంస్థల ప్రతినిధులతో ఏపీ ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వ పెద్దలకూ వ్యక్తిగత సంబంధాలూ వున్నాయి. కానీ ఎవ్వరికీ ఆహ్వాన పత్రికలు పంపలేదని తెలుస్తోంది. దీనిపట్ల పలువురు తెలుగు ప్రముఖులు ఆవేదనగా ఉన్నారట.