పోలవరం ప్రాజెక్టుకు చిక్కులు: బిజెడి ఎంపి కొలికి
న్యూఢిల్లీ: గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు ఒడిషాకు చెందిన బిజెడి పార్లమెంటు సభ్యుడు దిలీప్ కుమార్ తిర్కే కొలికి పెట్టారు. తెలంగాణ, చత్తీస్గఢ్, ఒడిషాలో ముంపునకు గురవుతున్న ప్రాంతాల్లో నష్ట పరిహారం చెల్లించి పునరావాస ఏర్పాట్లు చేసిన తరువాతే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులను కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.
గురువారం రాజ్యసభ జీరోఅవర్లో తిర్కే ఈ అంశాన్ని లేవనెత్తారు. తమ సభ్యుడు ప్రస్తావించిన అంశంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ బిజెడి సభ్యులు డిమాండ్ చేశారు. మొదట తిర్కే మాట్లాడుతూ - పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒడిషా,తెలంగాణ, చత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించకుండానే పోలవరం కింద సాగులోకి తీసుకురావలసిన ప్రాంతం పరిధిని పెంచిందని ఆరోపించారు.
1980లో తీసుకున్న నిర్ణయం మేరకు 36 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలనుకున్నారని, అయితే ఏపి సర్కార్ పొరుగురాష్ట్రాలతో సంప్రదించుకండా సాగుభూమి పరిధిని 50 లక్షల ఎకరాలకు పెంచిందని ఆయన ఆరోపించారు. సాగుభూమి పరిధిని పెంచటం వల్ల పర్యావరణం పెద్ద ఎత్తున ప్రభావితం అవుతుందని ఆయన అన్నారు.
ప్రాజెక్టు మూలంగా సర్వం కోల్పోతున్న వారికి ప్రత్యామ్నాయ పథకాలను అమలు చేయటం లేదని విమర్శించారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తాను ప్రస్తావించిన అంశంపై సమాధానం చెప్పాలంటూ తిర్కేతోపాటు పలువురు బిజెడి సభ్యులు పట్టుపట్టారు. ఉపాధ్యక్షుడు పిజె కురియన్ మాత్రం వారి డిమాండ్ను ఆమోదించలేదు.