తెలుగు రాష్ట్రాల్లో దూకుడు పెంచిన బీజేపీ..! బలమైన సామాజిక వర్గాలే కమలం టార్గెట్..!!
అమరావతి/హైదరాబాద్ : తెలుగు రాష్టాల్లో బీజేపి దూకుడు పెంచుతోంది. తెలుగు రాష్ట్రాల బుజాన గన్ పెట్టి దక్షిణ భారతాన్ని టార్గెట్ చేయాలని ప్రణాళిక రచిస్తోంది. అందుకు రెండు తెలుగువ రాష్ట్రాలను ముందుగా తమ ఆదీనంలోకి తెచ్చుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు, తెలంగాణలో లోక్సభ ఎన్నికల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు పెను సంచలనాలకు కేంద్ర బిందువులుగా మారాయి. పలువురు నాయకుల కదలికలు కూడా కలకలం రేపుతున్నాయి.
వారి మాటలు రాజకీయవర్గాల్లో వాడివేడి చర్చకు తెరలేపుతున్నాయి. ముఖ్యంగా ఈ పెనుమార్పులకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నే కారణమనే చర్చ కూడా జరుగుతోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి అటు ఆంధ్రప్రదేశ్లో, ఇటు తెలంగాణలో అధికారంలోకి రావాలన్న వ్యూహంతో ఇప్పటి నుంచే బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఆయా రాష్ట్రాల్లోని బలమైన సామాజిక వర్గాల నేతలకు గాలం వేస్తున్నారు బీజేపి నేతలు.
తెలుగు రాష్ట్రాలపై బీజేపి ఫోకస్..! బలమైన సామాజిక వర్గాలపై కన్నేసిన కమలం నేతలు..!!
కేంద్రంలో రెండోసారి బంపర్ మెజారిటీతో అదికారంలోకి వచ్చిన కమలం పార్టీ ప్రాంతీయ పార్టీలు ఏలుతున్న రాష్ట్రాలపై కన్నేసింది. ఇప్పటికే బెంగాల్ లో నెమ్మదిగా పాగా వేసిన బీజేపీ..ఇక దక్షిణాది వైపు పడింది. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం ఎప్పుడు కుప్ప కూలుతుందా..? అని ఎదురు చూస్తున్న బీజేపీ..ఎప్పుడెప్పుడు రాష్ట్రంలో అధికారం చేజిక్కిచ్చుకుందామా అన్నట్లు ఉంది. ఇక ఈ ఎన్నికల ఫలితాల తర్వాత కమలనాథులు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలను టార్గెట్ చేసాయి.
ఏపీలో టీడీపీని ఖాళీ చేయించి...పట్టు సాధిద్దామని చూస్తుండగా...తెలంగాణాలో టీఆర్ఎస్ అసంతృప్త నేతలను...అలాగే కాంగ్రెస్ నేతలను మెల్లగా లాగే ప్రయత్నంలో పడింది. ఇక తెలంగాణాలో గత లోక్ సభ ఎన్నికలు ఇచ్చిన ఫలితాలు, కమలనాథులలో ఫుల్ జోష్ నింపాయి. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీనపడడంతో టీఆర్ఎస్ కు గట్టి ప్రతిపక్షం లేకపోవడంతో, ఈ ప్రభుత్వానికి తామే ప్రత్యామ్నాయం అంటూ తెలంగాణలో పార్టీ బలం పెంచాలని బీజేపీ చూస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో బలపడాలి..! దక్షిణ భారతంలోకి ఎంట్రీ ఇవ్వాలన్నదే బీజేపి ప్లాన్..!!
ఇక ఇది ఇలా ఉందటే తెలంగాణాలో వెలమ పాలనకు చెక్ పెట్టి..బలమైన సామాజికవర్గంగా ఉన్న రెడ్లను దింపాలని బీజేపీ యోచిస్తుంది. ఇందులో భాగంగానే తెలంగాణాలో డైనమిక్ లీడర్ కిషన్ రెడ్డిని కేంద్రంలో తన శాఖానే సగమిచ్చి మంత్రిగా తీసుకుని అమిత్ షా రాజకీయ పాఠాలు బోధిస్తున్నారు. టీఆర్ఎస్ ని ఎలా కొట్టాలో కూడా మెలకువలు చెబుతున్నారు. కిషన్ రెడ్డి కూడా మంచి మాటకారి. అనేక ఉద్యమాలను చేసిన వాడు. ఆయన చురుకుదనం, కులబలం పెట్టుబడిగా పెట్టి రేపటి రోజున తెలంగాణా గెలవాలని బీజేపీ ఆలోచనగా ఉంది. ఇక ఏపీలో చూసుకుంటే జగన్ రెడ్డి సామాజికవర్గంలో ఏకైక నాయకునిగా ఉన్నారు. ఆ వర్గాన్ని ఆకట్టుకుంటేనే తప్ప బీజేపీకి విజయం సాధ్యం కాదు. కమ్మ సామాజికవర్గం ఎటూ బీజేపీకి కొంత బలంగా ఉంది. టీడీపీ ఎంత బలహీన పడితే అంతలా ఆ వర్గం బీజేపీ చెంతన చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
ఏపి రెడ్డి నేతలపై బీజేపి నజర్..! వస్తే సీఎం సీటు ఖాయమంటున్న కమలం ముఖ్య నేతలు..!!
ఈ నేపధ్యం నుంచి చూసినపుడు అధికారంలో ఉన్న జగన్ ని దెబ్బతీయాలంటే ఆయన ఆయువు పట్టుగా ఉన్న రెడ్లను చేరదీయాలి. అందుకే ఆ వర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని చేర్చుకుని తురుపు ముక్కలా ప్రయోగించాలనుకుంటోంది. కిరణ్ కూడా వైఎస్సార్ శిష్యుడే. కాంగ్రెస్ లో సీమకు చెందిన కీలక నేత. అయితే సొంత బలం లేకపోవడం వల్ల వెనక్కివెళ్లిపోయారు. ఆయన పాలన పట్ల జనంలో కొంత మంచి అభిప్రాయం కూడా ఉంది. దాంతో ఆయనికి పార్టీ బలం ఇవ్వడం ద్వారా గట్టిగా ఫోకస్ చేస్తే జగన్ కి ప్రత్యామ్న్యాయ నేత అవుతారని బీజేపీ ఆశ పెట్టుకుంటోంది.రెండు తెలుగు రాష్ట్రాల్లో రెడ్డి సామాజికవర్గాన్ని దువ్వడం ద్వారానే అధికార పీఠాన్ని అందుకోగలమని బీజేపీ గట్టి అంచనాలే వేసుకుంది.
తెలంగాణలో వెలమ సామాజిక వర్గం నేతల కోసం వేట..! గులాబీని దెబ్బకొట్టడమే కమలం లక్ష్యం..!!
కాంగ్రెస్ జమానాలో ఉమ్మడి ఏపీలో రెడ్డి సాదమాజిక వర్గానికి చెందిన నేతలు దశాబ్దాల పాటు రాజకీయాలను శాసించారు. ఇపుడు కాంగ్రెస్ ఓటమి పాలు కావడంతో వారు సరైన రాజకీయ వేదిక కోసం చూస్తున్నారు. అందువల్ల వారిని చేరదీసి ఆదరిస్తే కాంగ్రెస్ తరహాలోనే తెలుగు రాష్ట్రాలల్లో అధికారం చెలాయించవచ్చునని బీజేపీ అనుకుంటోంది. ఇక తెలంగాణాలో, ఏపీలో బీజేపీ వేస్తున్న ఈ ఎత్తులు ఎంత మేరకు ఫలిస్తాయో చూడాలంటున్నారు. ఇక టీడీపీ కి చంద్రబాబు తరువాత సరైన నాయకుడు ఎవరనేది నేతలకు ఇంకా సందేహమే. బయట నుండి ఇక సరైన నాయకుడు దొరికి ఉంటే ఆ పార్టీ నేతలు సైకిల్ దిగడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఏపీలో బలంగా ఉన్న వైసీపి, తెలంగాణలో బలంగా ఉన్న టీఆర్ఎస్ ను కాదని బీజేపీ ఎంత వరకు పుంజుకుంటుందో చూడాలి.