బీజేపీతో సుదీర్ఘ ప్రయాణం: పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం, కీలక ఆదేశాలు
అమరావతి: భారతీయ జనతా పార్టీతో పొత్తు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో క్రియాశీలక కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశించారు. శుక్రవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు టి. శివశంకర్, బొలిశెట్టి సత్య, పార్టీ ఉపాధ్యక్షులు బి. మహేందర్ రెడ్డి, అధ్యక్షుల వారి రాజకీయ కార్యదర్శి శ్రీ పి. హరిప్రసాద్ లతో పవన్ కళ్యాణ్ గారు సమావేశం అయ్యారు.
కష్టపడేవారికి ప్రాధాన్యత..
గంటన్నరపాటు సాగిన ఈ సమావేశంలో రానున్న నాలుగు వారాలకు సంబంధించి పార్టీ కార్యక్రమాల ప్రణాళికను రూపొందించాలని నిర్ణయించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడే వారితోపాటు తమ తమ వృత్తులు, ఉద్యోగాలు కొనసాగిస్తూ పార్టీ కోసం కష్టపడే వారి జాబితాలు తయారు చేయాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
బీజేపీతో సుదీర్ఘ ప్రయాణం
జనవరి నెల చివరి వారం నుంచి కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలన్నారు పవన్. బీజేపీతో సుదీర్ఘ రాజకీయ ప్రయాణం, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై కార్యకర్తల సమావేశాల్లో చర్చిస్తారు. గత కొన్ని సంవత్సరాలుగా పార్టీ జెండాను మోస్తున్న కార్యకర్తలందరినీ గుర్తించి వారిని ఆదరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. జాతీయ, ప్రాంతీయ ప్రాధాన్యత ఉన్న అంశాలు, పబ్లిక్ పాలసీస్, పార్టీ ఆలోచనా విధానం, వర్తమాన రాజకీయ అంశాలపై ఎంపిక చేసిన కార్యకర్తలకు వర్క్ షాప్స్ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు.
ఏపీ, తెలంగాణలో..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాలను రూపొందించాలన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన యువ అభ్యర్ధుల సమావేశాలను కూడా ఏర్పాటు చేయవలసిందిగా చెప్పారు. పార్టీలో ఉంటూ సామాజిక సేవ చేయాలన్న తలంపు ఉన్నవారితో సేవాదళ్ను పటిష్టంగా రూపొందించాలని సూచించారు. కాగా, ఇటీవల ఢిల్లీ వెళ్లిన పవన్ కళ్యాణ్ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, తదితర బీజేపీ పెద్దలను కలిసిన విషయం తెలిసిందే. బీజేపీతో కలిసి పనిచేయాలని ఆయన నిర్ణయించుకున్నారు.