స్థానిక ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసే పోటీ: ‘అప్పుడు టీడీపీ.. ఇప్పుడు వైసీపీ, రైతులకు అండగా మేము..’
అమరావతి: భారతీయ జనతా పార్టీతో జనసేన కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ఆ పార్టీల నేతలు సంయుక్తంగా ప్రకటించారు.
రాజధాని రైతులకు అండగా..
విజయవాడలో మంగళవారం జరిగిన బీజేపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించాయి. కాగా, రెండు పార్టీలు పొత్తు నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత తొలి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతుల దగ్గరకు బీజేపీ, జనసేన పార్టీలు సంయుక్తంగా వెళ్ళి, వారికి అండగా నిలవాలని నిర్ణయం తీసుకున్నాయి. రైతులకు భరోసా కల్పించాలని, అమరావతి రాజధాని విషయంలో ఉభయ పార్టీలు పోరాటం చేయాలని సంకల్పించాయి.
అప్పుడు టీడీపీ.. ఇప్పుడు వైసీపీ..
రాజధాని మార్పులపై కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించామనే ప్రచారాన్ని కమిటీ ఖండించింది. అబద్ధాలు, అభూత కల్పనలు ప్రచారం చేయడంలో ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ, నాడు అధికారంలో ఉన్న పార్టీ ఒకే విధంగా వ్యవహరిస్తున్నాయని ఈ కమిటీ మండిపడింది. అమరావతి ప్రస్తుత దుస్థితికి నాడు అధికారంలో ఉన్న టీడీపీ, నేడు అధికారంలో ఉన్న వైసీపీలు రెండూ బాధ్యులే అని సమన్వయ కమిటీ వ్యాఖ్యానించింది.
స్థానిక ఎన్నికల్లో కలిసే పోటీ.. బీజేపీ, జనసేన
బీజేపీ-జనసేన పార్టీలు కలసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని నిశ్చయించుకున్నాయి. ఇందుకోసం క్షేత్ర స్థాయిలో కమిటీలు నియమించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఉభయ పార్టీల అధ్యక్షులు ఆమోదం తెలిపిన తరవాత కమిటీ సభ్యులను ఎంపిక చేస్తారు.
సుదీర్ఘ చర్చ.. తాజా పరిస్థితిపై నివేదిక..
కాగా, రాజధాని మార్పు, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావడంపై సుదీర్ఘంగా చర్చించారు. శాసనమండలి రద్దుకు సంబంధించి కూడా సమన్వయ కమిటీ ప్రధానంగా చర్చించింది. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులకు సంబంధించి ఒక నివేదిక రూపొందించి పార్టీ అధిష్టానానికి అందిస్తామని ఇరుపార్టీల నేతలు వెల్లడించారు. విజయవాడలో జరిగిన బీజేపీ, జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశానికి బీజేపీ నుంచి దగ్గుబాటి పురందేశ్వరి, సోము వీర్రాజు, శాంతారెడ్డి హాజరయ్యారు. జనసేన పక్షాన నాదెండ్ల మనోహర్, టి.శివశంకర్, కందుల దుర్గేష్, సిహెచ్.మధుసూదన్ రెడ్డి, వి.గంగులయ్య, బి.శ్రీనివాస్ యాదవ్, బి.నాయకర్, సి.మనుక్రాంత్ రెడ్డి పాల్గొన్నారు.