రాజధానులపై తలోమాట: అయోమయంలో ఏపీ బీజేపీ: కొత్తగా వచ్చిన వారి వల్లే: సీనియర్ల అసహనం..!
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం.. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నాయకుల్లో చిచ్చు పెట్టినట్టు కనిపిస్తోంది. భేదాభిప్రాయాలను రేపింది. విభేదాలకు కారణమైంది. మూడు రాజధానులపై తలోమాట మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కోలా ప్రకటన చేస్తున్నారు. అది పార్టీ నిర్ణయమా? లేక వ్యక్తిగత అభిప్రాయమా? అనేది ఎక్కడా స్పష్టం చేయట్లేదు. ఈ పరిస్థితి పార్టీలో గందరగోళానికి దారి తీసింది.
సీనియర్లకు మింగుడు పడని వ్యవహారం..
క్రమశిక్షణ గల జాతీయ పార్టీగా పేరున్న బీజేపీలో ఇలాంటి పరిస్థితి ఏర్పడటం సీనియర్లకు ఏమాత్రం మింగుడు పడట్లేదు. బీజేపీలో ముందు నుంచీ కొనసాగుతున్న నాయకులు ఎవరూ మూడు రాజధానులపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. తెలుగుదేశం నుంచి కొత్తగా పార్టీలో చేరిన కొందరు నాయకుల తీరు వల్లే ఈ దుస్థితి తలెత్తిందనే అభిప్రాయంలో ఉన్నారు. సోము వీర్రాజు గానీ, హరిబాబు గానీ, జీవీఎల్ నరసింహా రావు గానీ తమ అభిప్రాయాలను వెల్లడించలేదు.
రాజకీయ ప్రత్యర్థుల్లో కలకలం..
మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ వైఎస్ జగన్ చేసిన ప్రకటన అనంతరం తెలుగుదేశం, జనసేన, బీజేపీల్లో కలకలాన్ని పుట్టించిది. తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకత్వం బాహటంగా దీన్ని వ్యతిరేకించింది. ఆందోళనకు దిగిన అమరావతి ప్రాంత రైతులకు బాసటగా నిలిచింది. బీజేపీలో కూడా దాదాపు ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణే స్వయంగా ఉద్దండరాయుని పాలెంలో మౌన దీక్షకు దిగారు.
బీజేపీకి, టీడీపీకి అదే తేడా..
టీడీపీలో నెలకొన్న పరిస్థితులే బీజేపీలోనూ ఏర్పడినప్పటికీ.. ఈ రెండు పార్టీలకు తేడా ఉంది. టీడీపీలో చంద్రబాబు ఏది చెబితే అదే తుది నిర్ణయం కావడం వల్ల ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నా చెల్లుతుంది. బీజేపీ జాతీయ పార్టీ. కేంద్రంలో అధికారంలో కొనసాగుతోంది. దాని పరిధి విస్తృతం. ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలనుకున్నా.. అది జాతీయ భావాలను ప్రతిబింబించేలా ఉండాల్సి ఉంటుంది.
కేంద్రం పేరు చెప్పి భయపెట్టే ప్రయత్నం..
సార్వత్రిక ఎన్నికల వరకూ తెలుగుదేశం పార్టీలో కొనసాగిన రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ వంటి నాయకులు బీజేపీలో చేరారు. ఈ ముగ్గురూ తలోమాట మాట్లాడుతున్నారు. టీజీ వెంకటేష్..మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతించారు. దీనిపై ఆరంభంలోనే ఆయన సానుకూల ప్రకటన చేశారు. సుజనా చౌదరి ముందు నుంచీ విభేదిస్తూనే వస్తున్నారు. తాజాగా ఆయన మరో అడుగు ముందుకేశారు. కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పి భయపెట్టే ప్రయత్నం చేశారు.
సుజనా చౌదరి వ్యాఖ్యలపై భగ్గు..
మూడు రాజధానుల నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం అంగీకరించబోదంటూ సుజనా చౌదరి చేసిన ప్రకటన పట్ల సీనియర్లు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. సుజనా చౌదరి చేసిన ప్రకటనకు సాటి నాయకులు, తోటి ఎంపీలు సీఎం రమేష్, జీవీఎల్ నరసింహా రావు నుంచే మద్దతు రాలేదు. సొంతగూటిలోనే ఆయనకు వ్యతిరేకత ఏర్పడింది. మూడు రాజధానులపై ఎవరు, ఎలాంటి ప్రకటన చేసినా అది వారి వ్యక్తిగత అభిప్రాయమేనని, పార్టీకి సంబంధమే లేదంటూ జీవీఎల్ స్పష్టం చేశారు. రాజధానుల ఏర్పాటుపై కేంద్రం జోక్యం చేసుకోబోదని, అది రాష్ట్రానికి మాత్రమే సంబంధించిన విషయమని వివరణ ఇచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
సీనియర్లలో అసహనం..
సుజనా చౌదరి చేస్తోన్న ప్రకటనల పట్ల వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటాన్ని సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. అది ఆయన వ్యక్తిగత ప్రకటనేనని పదే, పదే చెప్పుకోవాల్సి వస్తోందని అంటున్నారు. పార్టీలో ముందు నుంచీ కొనసాగుతోన్న సోము వీర్రాజు, హరిబాబు, జీవీఎల్, సోమగుంట విష్ణువర్ధన్ రెడ్డి వంటి నాయకులు సుజనా చౌదరి తీరు పట్ల గుర్రుగా ఉంటున్నారు. అందుకే ఈ వివాదంలో వారెవరూ నోరు విప్పట్లేదు. పార్టీలో నెలకొన్న పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు.