వైఎస్ జగన్ కంచుకోటపై కన్నేసిన కమలనాథులు.: భారీగా టీడీపీ, తటస్థుల చేరికలు!
కడప: భారతీయ జనతాపార్టీ రాష్ట్ర శాఖ రాయలసీమ జిల్లాలపై కన్నేసింది. పార్టీని క్షేత్రస్థాయిలో విస్తరించే దిశగా పావులు కుదుపుతోంది. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు, తటస్థులను దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉన్న ప్రాంతాల్లో వేళ్లూనుకోవడానికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్నారు కమలనాథులు. ఇందులో భాగంగా- కడప జిల్లా ప్రొద్దుటూరులో పెద్ద ఎత్తున ప్రాంతీయ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవలే బీజేపీ తీర్థాన్ని పుచ్చుకున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సొంత నియోజకవర్గం కావడం, ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో కాషాయ కండువాను కప్పుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ముగిసిన తరువాత తొలిసారిగా బీజేపీ నాయకులు రాయలసీమ ప్రాంత విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి.
టీడీపీ క్యాడర్ సహాయంతో బలోపేతం..
శతృవుకు శతృవు మిత్రుడనే యుద్ధ నీతిని అనుసరిస్తున్నారు బీజేపీ నాయకులు. తెలుగుదేశం, బీజేపీలకు ఉమ్మడి శతృవుగా భావిస్తోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ గా చేసుకున్నారు. సీఎం రమేష్ తెలుగుదేశాన్ని వీడిన తరువాత..జిల్లా టీడీపీ క్షేత్ర స్థాయి నాయకులు, కార్యకర్తలు నిస్తేజంగా మారిపోయారు. అలాంటి పరిస్థితిలో ఉన్న వారిని బీజేపీ నాయకులు తమ పార్టీలోకి చేర్చుకుంటున్నారు. మొన్నటి లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణంగా పరాజయం పాలు కావడం, ఆ వెంటనే పార్టీ జిల్లా నాయకులకు అన్ని రకాలుగా పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చిన సీఎం రమేష్ బీజేపీలో చేరడంతో కొంత అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారు కమలనాథులు. సీఎం రమేష్ అనుచరులు, ఆయన సానుభూతిపరులు పరులు క్రమంగా కమలనాథులకు దగ్గరవుతున్నట్లు కనిపిస్తోంది. విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి సీఎం రమేష్ సొంత నియోజకవర్గం ప్రొద్దుటూరును ఎంచుకోవడం ఇందులో భాగమేనని అంటున్నారు.
త్వరలో ఆది నారాయణ రెడ్డి వర్గం కూడా బీజేపీలోకి..
జిల్లాలో మరో బలమైన నాయకుడిగా పేరున్న మాజీమంత్రి చదిపిరాళ్ల ఆది నారాయణ రెడ్డి సైతం బీజేపీలో చేరడం ఖాయమైంది. లాంఛనప్రాయంగా చేరడం మాత్రమే మిగిలి ఉంది. ఆది నారాయణ రెడ్డి సొంత నియోజకవర్గం జమ్మలమడుగుకు చెందిన పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు బీజేపీ ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశానికి హాజరయ్యారు. బీజేపీలో చేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరడం ఎలాగూ ఖాయమైనందున..ఆయన క్యాడర్ కూడా టీడీపీని వీడటానికి మానసికంగా సిద్ధమైంది. ఎన్నికల సమయంలో కూడా ప్రొద్దుటూరు, జమ్మలమడుగు నియెజకవర్గాల్లో పెద్దగా కనిపించని కాషాయ జెండా.. అటు సీఎం రమేష్, ఇటు ఆది నారాయణ రెడ్డి చేరికల అనంతరం మరింత రెపరెపలాడొచ్చని అంటున్నారు. వైఎస్ఆర్ సీపీలో చేరడానికి సిద్ధపడని టీడీపీ క్యాడర్ మొత్తం బీజేపీ తీర్థాన్ని పుచ్చుకోవడం దాదాపు ఖాయమైందనే అభిప్రాయం బీజేపీ అగ్ర నాయకుల నుంచి వ్యక్తమౌతోంది.
అనంతపురంలోనూ మరో రౌండ్ సమావేశాలు
అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన క్షేత్రస్థాయి క్యాడర్ ను చేర్చుకోవడం వల్ల బలపడగలమనే అభిప్రాయంతో ఉన్నారు బీజేపీ నాయకులు. రాయలసీమ గ్రామాల్లో మొదటి నుంచీ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు పాదుకుని పోయాయి. మొన్నటి దాకా కాంగ్రెస్, ఆ తరువాత వైఎస్ఆర్ సీపీ, తెలుగుదేశం మధ్యే అధికారం చేతులు మారుతూ వచ్చింది. బీజేపీకి దక్కిన చోటు నామమాత్రమే. ప్రస్తుతం- ఈ పరిస్థితి లేదని, టీడీపీ నాయకులు ప్రత్యామ్నాయ పార్టీల వైపు చూస్తున్నారని అంటున్నారు. వైఎస్ఆర్సీపీకి ప్రత్యామ్నాయంగా తాము మాత్రమే ఎదుగుతున్నామని బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెబుతున్నారు. టీడీపీ నుంచి క్షేత్రస్థాయి కార్యకర్తలు, నాయకులు తమ పార్టీలో చేరడమే దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చని అంటున్నారు. రాజకీయంగా తటస్థంగా ఉన్న వారు సైతం కాషాయ కండువాను కప్పుకోవడానికి మొగ్గు చూపుతున్నారనది బీజేపీ నాయకుల వాదన. 2024 ఎన్నికల నాటికి అధికార వైఎస్ఆర్సీపీకి ధీటుగా, ప్రధాన పార్టీగా తాము పురోగమిస్తామని అంటున్నారు.