కొడాలి నానీ వ్యాఖ్యలపై భగ్గుమన్న బీజేపీ ..మోడీపై గౌరవం ఉంటే సీఎం జగన్ నానీని బర్తరఫ్ చెయ్యాలని డిమాం
ఏపీలో మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు దుమారం రోజు రోజుకీ ముదురుతోంది. మొన్నటికి మొన్న తిరుమల డిక్లరేషన్ పై వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని, నిన్న ఏకంగా ప్రధాని మోడీ పై, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మంత్రి కొడాలి నానీని బర్తరఫ్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ నాయకులు .
కొడాలి నానీ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ .. జగన్ వారిని కట్టడి చెయ్యాలి .. లేదంటే అంటూ వార్నింగ్
గుంటూరు, విజయవాడలలో బీజేపీ నిరసనలు .. నానీ బర్తరఫ్ డిమాండ్
గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట గురువారం బిజెపి కార్యకర్తలు కొడాలి నాని వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. మంత్రి కొడాలి నాని కి వ్యతిరేకంగా నినాదాలు చేసిన వారు, ప్రధాని మోడీ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి నాని పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విజయవాడలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద కొడాలి నాని వ్యాఖ్యలపై బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
విజయవాడ బీజేపీ కార్యాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు
కార్యాలయం నుంచి ర్యాలీగా బయల్దేరిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. బిజెపి కార్యాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు నేతలను అరెస్టు చేశారు. కొడాలి నాని వ్యాఖ్యలపై, పోలీసుల తీరుపై బీజేపీ నేతలు మండిపడ్డారు.బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తాజా పరిణామాల నేపథ్యంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు నోరు తెరిచి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఎంత కాలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తారని నిలదీశారు.
మోడీ, యోగీపై మాట్లాడే స్థాయి కొడాలి నానీది కాదన్న విష్ణువర్ధన్ రెడ్డి
కొడాలి నాని, రోజా వంటి వారు ఉద్దేశపూర్వకంగానే వ్యాఖ్యలు చేస్తున్నారని,ఇలా రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం మంచిది కాదన్నారు. ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించే స్థాయి వారికి లేదని ఫైర్ అయ్యారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్న మంత్రులు క్యాబినెట్ లో ఉండకూడదని ఆయన మండిపడ్డారు. కొడాలి నాని ని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కొడాలి నానిపై కేసులు పెట్టినా ప్రభుత్వం ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రభుత్వానికి అయ్యా ఎస్ అనవద్దని సూచించారు. హిందూ సమాజ సహనాన్ని పరీక్షించవద్దు అని, ఓపిక ఉన్నంత వరకే భరిస్తానని ఆ తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయని విష్ణువర్ధన్ రెడ్డి హెచ్చరించారు .
జగన్ మెప్పు కోసమే ఇదంతా .. నానీని బర్తరఫ్ చెయ్యాలని డిమాండ్
ప్రధాని నరేంద్ర మోడీ పై, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ఫైర్ అయ్యారు. నాని వ్యాఖ్యలను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. యోగి ఆదిత్యనాథ్ కు కొడాలి నానికి నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. కొడాలి నాని జగన్ మెప్పు కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కి ప్రధాని మోడీ పై, యోగి ఆదిత్యనాథ్ పై ఏమాత్రం గౌరవం ఉన్నా కొడాలి నాని ని భద్రత చేయాలని డిమాండ్ చేశారు. కొడాలి నాని మత్తులో ఉన్నారన్న విష్ణుకుమార్ రాజు, ఆ మత్తులో సీఎం జగన్మోహన్ రెడ్డి వదిలించాలంటూ డిమాండ్ చేశారు.