కంభంపాటి హరిబాబుకు...వేరే పదవి;ఇక కేంద్ర మంత్రి పదవి లేనట్టేనా?
అమరావతి: బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి పదవికి రాజీనామా చేసిన విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబును భారతీయ జనతా పార్టీ అధిష్టానం నూతన పదవిలో నియమించింది. హరిబాబును బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు.
బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా మూడేళ్లు పనిచేసిన హరిబాబు రెండు రోజుల క్రితం తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. హఠాత్తుగా హరిబాబు రాజీనామా చేయడం ఎపి రాజకీయాల్లో సర్వత్రా చర్చనీయాంశమైంది. వర్గాలుగా విడిపోయినట్లు కనిపిస్తున్నఎపి బిజెపిలో ప్రత్యర్థి వర్గం నుంచి ఎదురవుతున్న విమర్శల కారణంగానే హరిబాబు తన పదవికి రాజీనామా చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఏడాదితోనే ముగిసినా...మూడేళ్లు
2014 జనవరిలో ఎపి బిజెపి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన హరిబాబు పదవీకాలం వాస్తవానికి 2016లోనే ముగిసింది. అప్పటి నుంచి పార్టీ అధ్యక్ష మార్పుపై చర్చ జరుగుతూనే ఉంది. అయినా పార్టీ మరో వ్యక్తిని అధ్యక్షుడిగా నియమించక పోవడంతో అప్పటినుంచి ఇప్పటివరకు ఆపద్దర్మ అధ్యక్షుడి హోదాలో కంభంపాటి హరిబాబే ఆ పదవిలో కొనసాగుతూ వచ్చారు. అలాంటి ఆయన హఠాత్తుగా తన పదవికి రాజీనామా చేయడం సహజంగానే సంచలనం సృష్టించింది. ఎందుకంటే ఇప్పుడు కూడా పార్టీ ఎవరిని ఎపి బిజెపి అధ్యక్షుడిగా నియమించలేదు కనుక...అయినా కంభంపాటి రాజీనామా చేసేయడంపై తీవ్రమైన చర్చ జరుగుతోంది.
రాజీనామాపై...వాదనలు ఇవి
హఠాత్తుగా హరిబాబు రాజీనామాపై అనేక వాదనలు వినిపిస్తున్నాయి. అయితే మిత్రపక్షాలు టీడీపీ-బిజెపి తెగతెంపుల నేపథ్యంలో ఎపి అధ్యక్ష పదవి మార్పు అనివార్యం కావడంతో బిజెపి అధిష్టానం ఆదేశాల మేరకే ఆయన తన పదవికి రాజీనామా చేశారనేవి ఎక్కువమంది విశ్వసిస్తున్న వాదన. అయితే మరో వాదన ఏమిటంటే అధిష్టానం ఆదేశాలతో సంబంధం లేకుండా తనంతట తానుగానే హరిబాబు రాజీనామా నిర్ణయం తీసుకున్నారట. కర్ణాటక ఎన్నికల తర్వాత పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించడం ఖాయమని తెలిసిన నేపథ్యంలో పార్టీ వేరే వారిని ప్రకటించిన తరువాత తాను పదవికి రాజీనామా చేయడం కంటే ముందే చేయడం బాగుంటుందన్న ఆలోచనతో హరిబాబు ఇలా చేశారని బిజెపిలో ఆయనను అభిమానించే మద్దతుదారులు చెబుతున్నారు.
కొత్త పదవి సరే..మరి కేంద్ర మంత్రి పదవి
అయితే ఎపి బిజెపి అధ్యక్ష పదవికి హరిబాబు రాజీనామా చేసిన తరువాత విశాఖ ఎంపీ హరిబాబుకు మరో పదవి విషయమై ఆసక్తిదాయకమైన వార్తలు వెలువడ్డాయి. ఈయనకు కేంద్రమంత్రి పదవి దక్కడం ఖాయమనే మాట బలంగా వినిపించింది. కేంద్రమంత్రి నుంచి వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా వెళ్లిపోవడం, ఒకసారి కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో దాదాపుగా పదవి వచ్చినట్లే వచ్చి చేజారిపోవటం, ఎపికి చెందిన టిడిపి మంత్రులు ఆశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి తమ పదవులకు రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీలు తదిదర రాజకీయ పరిణామాల నేఫథ్యంలో హరిబాబుకు కేంద్రంలో సహాయమంత్రి పదవి దక్కడం ఖాయమని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది.
ఈ పదవితో...ఆ పదవికి ఫుల్ స్టాఫా!
హరిబాబు ఎంత అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారో బిజెపి అధిష్టానం కూడా అంతే అనూహ్యంగా వెనువెంటనే జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించడం ఆశ్చర్యకర పరిణామం గానే చెప్పుకోవచ్చు. మరోరకంగా చూస్తే ఇది టిట్ ఫర్ టాట్ లా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎలాగంటే ఎంపీ హరిబాబు పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవికి హఠాత్తుగా రాజీనామా చేయడం...ఆ లేఖను సైలెంట్ గా పార్టీ అధ్యక్షుడు అమిత్షాకు పంపడం కలకలం రేపింది. హరిబాబు సోమవారం సాయంత్రమే తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షునికి పంపగా...ఆ విషయాన్నిమంగళవారం ద్వారా లీకవడంతో బిజెపి అధిష్టానంకు చిన్నపాటి షాక్ తగిలినట్లయిందట. దీంతో అందుకు ప్రతిగా బిజెపి ఇక కేంద్రమంత్రి పదవి అనే ప్రచారానికి ఫుల్ స్టాప్ పడేలా ఈ పదవిని వెంటనే ప్రకటించిందనేది మరికొందరి వాదన.