వరవరరావు విడుదలపై భూమన లేఖ- చర్యలు తీసుకోలేదని జగన్పై సునీల్ దియోధర్ ఫైర్..
ప్రధాని మోడీ హత్య కోసం జరిగిన బీమా కొరెగావ్ కుట్ర విషయంలో విరసం నేత వరవరరావును వెనకేసుకొస్తున్న పార్టీలు, నేతలపై బీజేపీ తాజాగా స్వరం పెంచుతోంది. తాజాగా ఇదే అంశంపై ఏపీలోని వైసీపీ ప్రభుత్వాన్ని కూడా ఇరుకునపెట్టేందుకు బీజేపీ సిద్దమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహారాష్ట్ర జైల్లో ఉన్న వరవరరావును విడుదల చేయాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి ప్రధానికి రాసిన లేఖ ఇప్పుడు కలకలం రేపుతోంది.
వరవరరావు విడుదల కోరుతూ లేఖ రాసిన భూమన కరుణాకర్రెడ్డిపై సీఎం జగన్ చర్యలు తీసుకుని ఆయన్ను సస్పెండ్ చేయాలని బీజేపీ నేత సునీల్ దియోధర్ కోరారు. కానీ జగన్ అలా చేయకపోవడంతో ఈ లేఖ మీ అనుమతితోనే వెళ్లిందా అంటూ జగన్కు టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఓవైపు మీరు ప్రధాని మోడీని కలిసి ఫొటోలు విడుదల చేస్తారు. మీ ఎమ్మెల్యే భూమన అదే మోడీని హత్య చేసేందుకు కుట్ర పన్నిన వరవరరావును విడుదల చేయాలని లేఖ రాస్తారు. ఇది మీ ద్వంద ప్రమాణాలకు నిదర్శనం కాదా అంటూ బీజేపీ ఏపీ ఇన్ఛార్జ్ సునీల్ దియోధర్ నిలదీశారు.
ఇప్పటికైనా ఎమ్మెల్యే భూమనను సస్పెండ్ చేసి క్షమాపణ చెప్పించాలని జగన్ను సునీల్ దియోధర్ డిమాండ్ చేశారు. మావోయిస్టులు రాజ్యాంగ వ్యతిరేకులు అంటూ ఓ ట్యాగ్లైన్ను కూడా ఆయన తన ట్వీట్కు జత చేశారు.