జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి బీజేపీ గాలం వేస్తోందా? పార్టీలో ప్రాధాన్యత ఉంటుందంటూ
అనంతపురం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జేసీ దివాకర్ రెడ్డి కుటుంబంపై భారతీయ జనతాపార్టీ కన్నేసిందా? పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసిందా? కాషాయ కండువాను కప్పుకొంటే ప్రాధాన్యత గల పదవులను ఇస్తామంటూ భరోసా ఇస్తోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది అనంతపురం జిల్లా రాజకీయాల్లో. జేసీ దివాకర్ రెడ్డి మాత్రమే కాకుండా.. ఆయన కుటుంబం మొత్తాన్నీ చేర్చుకోవడానికి మంతనాలు చేస్తోందని తెలుస్తోంది. జేసీ బ్రదర్స్, వారి కుమారులు పార్టీలో చేరితే ప్రాధాన్యత గల పదవులు ఇస్తామని బీజేపీ ఏపీ నాయకులు స్పష్టం చేసినట్లు చెబుతున్నారు.
తుంగభద్ర ఎఫెక్ట్: కృష్ణమ్మకు వరద పోటు: శ్రీశైలం, నాగార్జున సాగర్ గేట్ల ఎత్తివేత
ఆదినారాయణ రెడ్డి చేరికతో..
కడప జిల్లా నుంచి తెలుగుదేశం మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కాషాయ తీర్థాన్ని పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఆయన చేరిక ప్రభావం జమ్మమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గాపై ఉంటుందని, ఈ మూడు నియోజకవర్గాల్లో బలపడటానికి అవకాశం దొరికినట్టయిందని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఇక జేసీ కుటుంబాన్ని కూడా చేర్చుకుంటే అనంతపురం జిల్లా రాజకీయాలపై గట్టి పట్టు చిక్కుతుందనే అభిప్రాయం వారిలో నెలకొంది. ఇదే అభిప్రాయాన్ని పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సైతం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.
జేసీ బ్రదర్స్.. వారి కుమారుల కోసం
బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జేసీ దివాకర్ రెడ్డి దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ లో కొనసాగారు. రాష్ట్ర విభజన అనంతరం వారిద్దరూ కాంగ్రెస్ ను వీడారు. జేసీ టీడీపీలో చేరగా.. కన్నా బీజేపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. మొన్నటి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి చేదు ఫలితాలు ఎదురయ్యాయి. జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయలేదు. తమకు బదులుగా కుమారులు పవన్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను ఎన్నికల బరిలో దించారు. పవన్ రెడ్డి అనంతపురం లోక్ సభ అభ్యర్థిగా, అస్మిత్ రెడ్డి తాడిపత్తి అసెంబ్లీ అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేసి, దారుణ పరాజయాన్ని చవి చూశారు.
బీజేపీలోకి చేరితే.. మంచి పదవులు
లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలిన తరువాత జేసీ కుటుంబం పెద్దగా క్రియాశీలక రాజకీయాల్లో కనిపించలేదు. జేసీ దివాకర్ రెడ్డి ఒక్కరే తరచూ తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. చాలాకాలం పాటు కాంగ్రెస్ లో కొనసాగడం వల్ల తెలుగుదేశం అంటే జేసీ కుటుంబానికి పెద్దగా అనుబంధం ఏమీ లేదు. రాజకీయాల్లో ఉండాలనే ఉద్దేశంతోనే తాను టీడీపీ తీర్థాన్ని పుచ్చుకున్నట్లు జేసీ దివాకర్ రెడ్డి బాహటంగా చెప్పుకొన్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో- టీడీపీకి ప్రత్యామ్నాయంగా తామే ఎదుగుతున్నామని బీజేపీ నాయకులు జేసీ కుటుంబాన్ని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
గాంధీ సంకల్ప యాత్ర ద్వారా
జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాలను పురస్కరించుకుని బీజేపీ అధిష్ఠానం దేశవ్యాప్తంగా గాంధీ సంకల్పయాత్రను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ యాత్ర ద్వారా స్థానిక రాజకీయ నాయకులపై ఫోకస్ పెట్టిందని, జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం కోసం ప్రయత్నాలు సాగించడం ఇందులో భాగమేనని సమాచారం. రాజకీయ అవసరాల కోసమే జేసీ కుటుంబం ఇదివరకు టీడీపీలో చేరిన నేపథ్యంలో.. అవే రాజకీయ కారణాల వల్ల ఆ పార్టీని వీడే అవకాశాలను పరిశీలించాలని, ప్రత్యామ్నాయంగా తమ పార్టీలో చేరాలని బీజేపీ నాయకులు ఒత్తిడి తీసుకొస్తున్నారని అంటున్నారు.