BJP: పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా బీజేపీ సంతకాల సేకరణ..!
కడప: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ.. కౌంటర్ అటాక్ ను ఆరంభించింది. ఈ చట్టాన్ని అమలు చేయడానికి గల కారణాలు, అందులో పొందుపరిచిన అంశాలను వివరించేలా ప్రచార కార్యక్రమాలను చేపట్టింది. ఇందులో భాగంగా- బీజేపీ రాష్ట్రశాఖ నాయకులు శనివారం కడపలో జన జాగారణ మహా ర్యాలీని నిర్వహించనున్నారు.
బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ ర్యాలీకి ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. కడప అంబేద్కర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా- సంతకాల సేకరణను కూడా బీజేపీ నాయకులు చేపట్టారు. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తొలి సంతకం చేసి దీన్ని ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడారు. పౌరసత్వ సవరణ చట్టంపై ప్రజల్లో నెలకొన్న అపోహలు, అనుమానాలను తొలగించడానికి తాము ఈ ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఇందులో భాగంగా- రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, విద్యాసంస్థల్లో ప్రత్యేకంగా సెమినార్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికీ వెళ్లి.. పౌరసత్వ సవరణ చట్టం వెనుక గల ఉద్దేశాలను, దాన్ని అమలు చేయడ వల్లే కలిగే ప్రయోజనాలను వివరిస్తామని తెలిపారు.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చోటు చేసుకుంటున్న అల్లర్లు, హింసాత్మక పరిస్థితుల వెనుక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ప్రజల్లో లేనిపోని అనుమానాలను రేకెత్తిస్తున్నారని, ఆందోళన దిశగా వారిని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు దేశ సమైక్యతకు భంగం వాటిల్లేలా వ్యవహరిస్తున్నారని చెప్పారు. వరుసగా రెండు సార్లు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఓడించినప్పటికీ.. తన వైఖరిని మార్చుకోలేకపోతోందని ఎద్దేవా చేశారు.