వైఎస్ జగన్ నిర్ణయాన్ని ప్రశంసిస్తోన్న రాజకీయ ప్రత్యర్థులు: ఇదే తొలిసారి!
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అమలు చేస్తోన్న పథకం వైఎస్సార్ రైతు భరోసా. రాష్ట్రంలో అర్హులైన రైతులందరికీ ఏటా 13,500 రూపాయల చొప్పున ఆర్థిక ప్రోత్సాహాన్ని కల్పించడానికి ఉద్దేశించిన పథకం ఇది. నిజానికి- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే రైతు భరోసా పథకం కింద రైతులకు సాలీన చెల్లిస్తామని ప్రకటించిన మొత్తం 12,500 కోట్ల రూపాయలు. ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో సైతం పొందు పరిచింది. రైతు భరోసా పథకం ప్రారంభానికి సరిగ్గా 24 గంటల ముందు నిర్ణయాన్ని మార్చుకుంది. మరో 1000 రూపాయలను జత చేసింది. చెప్పిన దాని కంటే అధిక మొత్తాన్ని చెల్లిస్తోంది.
50 లక్షల మంది రైతులకు సీఎం జగన్ మేలు.. నెల్లూరు వేదికగా రైతు భరోసా
కేంద్రం మ్యాచింగ్ గ్రాంటును కలిపి..
ఆర్థికంగా వెసలుబాటు ఉండటం వల్ల ఈ మొత్తాన్ని 13,500 రూపాయలకు పెంచినట్లు సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని కూడా ఇందులో జత చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఏటా 6000 రూపాయల మొత్తం ప్రభుత్వ ఖజానాకు అందుతుంది. ఈ మొత్తాన్ని అర్హులైన రైతులకు చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. ఈ నేపథ్యంలో రైతు భరోసా, కేంద్ర ప్రకటించిన కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని కలిపేసింది. రైతు భరోసా పథకం కింద తాను చెల్లించదలిచిన మొత్తానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే 6000 రూపాయల మ్యాచింగ్ గ్రాంటును జత చేసింది. ఈ పథకానికి వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ అని సరికొత్తగా నామకరణం చేసింది.
బీజేపీ హర్షం..
రైతు భరోసా పథకానికి ప్రధానమంత్రి పేరును కూడా పెట్టడంపై భారతీయ జనతాపార్టీ హర్షం వ్యక్తం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్నపథకాని తనవి చెప్పుకోకుండా.. కేంద్రానికి గుర్తింపు నివ్వడం హర్షణీయమని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం తరహాలో కాకుండా ఇదే తరహా విధానాన్ని కొనసాగించాలని ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సూచించారు. కేంద్రం అమలు చేస్తోన్న పథకాలకు ప్రధానమంత్రి పేరును తప్పనిసరిగా జత చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదివరకటి చంద్రబాబు ప్రభుత్వం కేంద్ర పథకాలను కూడా తనవిగా చెప్పుకొనేదని విమర్శించారు. కేంద్ర పథకాలపై తమ పార్టీ స్టిక్కర్లను అతికించి అమలు చేశారని ఎద్దేవా చేశారు.
ప్రధానమంత్రి పేరు పెట్టడం ఇదే తొలిసారి..
కేంద్రం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలకు ప్రధానమంత్రి పేరు పెట్టి రాష్ట్రంలో అమలు చేయడం దాదాపుగా ఇదే తొలిసారి అని బీజేపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పలు కేంద్ర పథకాలు అమలుకు నోచుకున్నప్పటికీ.. వాటన్నింటినీ తనవిగా చెప్పుకొనే వారని విమర్శిస్తున్నారు. ఎల్ఈడీ బల్బుల సరఫరా మొదలుకుని వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం వరకూ ప్రతి పథకాన్ని గత చంద్రబాబు ప్రభుత్వం తనవిగా చెప్పుకొనేదని ధ్వజమెత్తుతున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేసిందని, వాటిని అమలు చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. తామే నిధులను మంజూరు చేసినట్లు చెప్పుకొన్నదని ఆరోపిస్తున్నారు.