ఫ్రెండ్స్ పార్టీలో ఏమైంది? సుహారిక బావ కూడా అక్కడే:హోమిసైడల్, సూసైడ్ కేసుపై క్లారిటీ
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ చిన్న కోడలు నల్లపురెడ్డి సుహారిక రెడ్డి ఆకస్మిక మరణం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలను సృష్టిస్తోంది. 32 ఏళ్ల వయస్సులోనే ఆమె హఠాన్మరణానికి గురి కావడానికి గల కారణాలు ఏమై ఉంటాయా? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఆమె ఆత్మహత్య చేసుకున్నారంటూ మొదట్లో వచ్చిన వార్తలు మరింత గందరగోళానికి దారి తీశాయి. దీన్ని పోలీసులు తోసి పుచ్చారు. సుహారిక ఆత్మహత్య చేసుకోలేదంటూ స్పష్టం చేశారు. ఆమె మరణానికి గల కారణాలు ఏమిటనేది పోస్ట్మార్టమ్ నివేదిక అందిన తరువాతే తెలుస్తుందని పేర్కొన్నారు.
Recommended Video
కన్నా చిన్నకోడలు అనుమానాస్పద మృతి.. ఫ్రెండ్ ఇంటికి వెళ్లి.. ఏపీ బీజేపీ చీఫ్ ఫ్యామిలీలో విషాదం..
ఫ్రెండ్స్ పార్టీలో ఏం జరిగింది?
కన్నా లక్ష్మీనారాయణ రెండో కోడలు సుహారిక. భర్త ఫణీంద్రతో కలిసి ఆమె గచ్చిబౌలిలోని హిల్రిట్జ్ విల్లాస్లో నివాసం ఉంటున్నారు. గురువారం సాయంత్రం తన స్నేహితుడు పవన్ రెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసిన ఓ చిన్న పార్టీకి హాజరు అయ్యారు. ఫణీంద్రకు ఫ్యామిలీ ఫ్రెండ్ పవన్ రెడ్డి. పార్టీ సందర్భంగా తన స్నేహితులతో కలిసి ఆమె ఉత్సాహంగా డాన్స్ చేశారు. డాన్స్ చేసిన కొద్దిసేపటికే పార్టీలోనే ఆమె కుప్పకూలిపోయారు. వెంటనే ఆమెన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించగా..అప్పటికే మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు.
ఫ్రెండ్స్ పార్టీలో సుహారిక బావ కూడా..
పవన్ రెడ్డి ఏర్పాటు చేసిన ఈ పార్టీకి సుహారిక బావ కూడా హాజరయ్యారు. ఆయన పేరు ప్రవీణ్ రెడ్డి. సుహారిక చెల్లెలి భర్త అతను. కన్నా రెండో కుమారుడు ఫణీంద్రకు తోడల్లుడు అవుతారు. ఇదే పార్టీలో సుమారు 10 నుంచి 12 మంది వరకు హజరై ఉండొచ్చని అంటున్నారు. సుహారికా ఇదే పార్టీకి హాజరు అయ్యారు. చాలాకాలం తరువాత కలుసుకోవడంతో గెట్ టు గెదర్ లాంటి పార్టీని ఏర్పాటు చేశారు. ఇదే పార్టీలో డాన్స్ చేస్తూ ఉన్నట్టుండి సుహారికా కుప్పకూలిపోయారు.
హత్య, ఆత్మహత్య కోణాలను కొట్టి పారేసిన పోలీసులు..
ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తోంటే. అది హత్యగా నిర్ధారించట్లేదని రాయదుర్గం పోలీసులు స్పష్టం చేశారు. అలాగనీ ఆత్మహత్య కూడా కాదని తేల్చి చెప్పారు. తల్లి, భర్త ఫణీంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని అన్నారు. సుహారికా మరణానికి గల ఖచ్చితమైన కారణం ఏమిటనేది పోస్ట్మార్టమ్ నివేదిక అందిన తరువాతే స్పష్టమౌతుందని చెప్పారు. ఈ పార్టీలో గొడవ జరిగిందనడానికి కూడా ఎలాంటి సాక్ష్యాలు లభించలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ కోణంలోనూ తాము దర్యాప్తు కొనసాగిస్తామని వెల్లడించారు.
ఉదయం 11:30 గంటల సమయంలో..
గురువారం ఉదయం 11:30 గంటల సమయంలో సుహారికా ఫ్రెండ్స్ పార్టీకి వెళ్లారని పోలీసులు ప్రాథమికంగా నిర్దారించినట్లు సమాచారం. అరగంట తరువాత ఆమె కుప్పకూలిపోవడంతో హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. ఈ సమాచారం సాయంత్రానికి గానీ బయటికి రాలేదని తెలుస్తోంది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా ఆలస్యంగా ఇచ్చినట్లు చెబుతున్నారు. పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చిన తరువాతే ఈ విషయం వెలుగులోకి వచ్చింది.