సీఎం రమేష్, సుజన చౌదరి వైఖరిపై బీజేపీ సీనియర్లలో అసహనం: టీడీపీ అధికార ప్రతినిధులుగా..!
అమరావతి: రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, సుజన చౌదరిల వైఖరిపై భారతీయ జనతాపార్టీ రాష్ట్రశాఖకు చెందిన కొందరు సీనియర్ నాయకుల్లో తీవ్ర అసహనం వ్యక్తమౌతోందని, వారిద్దరి తీరు పట్ల అసంతృప్తికి గురవుతున్నట్లు సమాచారం. వారిద్దరూ తెలుగుదేశం పార్టీకి అధికార ప్రతినిధులుగా ప్రవర్తిస్తున్నారని కొందరు సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నట్లు తెలుస్తోంది. చాలా విషయాల్లో తెలుగుదేశం పార్టీ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మద్దతుగా వారు మాట్లాడుతున్నారని, ఇలాగైతే పార్టీలో కొనసాగడం కష్టమనే అభిప్రాయంలో ఉన్నట్లు చెబుతున్నారు. పోలవరం, రాజధాని నిర్మాణం వంటి కీలకమైన అంశాల్లో సుజనా చౌదరి బీజేపీ నాయకుడిగా టీడీపీకి వంతపాడారని, దీనిపట్ల క్షేత్రస్థాయి క్యాడర్ లో వ్యతిరేకత వ్యక్తమౌతోదని అంటున్నారు.
కారణాలేమైనప్పటికీ.. పార్టీ ఫిరాయింపు
సీఎం రమేష్, సుజనా చౌదరి దశాబ్దాల కాలం పాటు తెలుగుదేశం పార్టీలో కొనసాగారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ తొలి హయాంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామ్య పక్షంగా ఉన్న సమయంలో సుజన చౌదరి మంత్రిగా కొనసాగారు. ప్రస్తుతం వారిద్దరూ రాజ్యసభ సభ్యులు. రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన కొద్దిరోజుల్లోనే సీఎం రమేష్, సుజనా చౌదరి తెలుగుదేశం పార్టీని వీడారు. బీజేపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడుల నుంచి తప్పించుకోవడం కోసమే వారిద్దరూ బీజేపీలో చేరారంటూ అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. బీజేపీలో చేరిన తరువాత కొద్దిరోజులకే క్రియాశీలకంగా మారిపోయారు.
రాజధాని తరలింపు వార్తలపై సుజనా చౌదరి విమర్శలు
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) పున:సమీక్ష, రివర్స్ టెండరింగ్, పోలవరం ప్రాజెక్టు వంటి కీలకమైన అంశాలపై సుజనా చౌదరి బాహటంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ వస్తున్నారు. ఆయా అంశాలన్నింటిలోనూ ఆయన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం ప్రభుత్వాన్ని సమర్థిస్తూ మాట్లాడటం బీజేపీ రాష్ట్రశాఖకు చెందిన కొందరు నాయకుల్లో అసంతృప్తికి గురి చేసింది. రాజధాని అమరావతిని తరలిస్తారంటూ వస్తోన్న వార్తలపై కూడా సుజనా చౌదరి స్పందించడం బీజేపీ నాయకత్వాన్ని మరింత ఇరకాటంలోకి నెట్టేసినట్టయింది. అమరావతి తరలింపుపై బీజేపీ వైఖరి, విధానాలు ఇంకా ఖరారు కానప్పటికీ.. సుజనా చౌదరి బాహటంగా విమర్శించడం ఆత్మరక్షణలో పడేసిందని అంటున్నారు.
జ్యోతి ప్రజ్వలన వ్యవహారంలో ఎదురుదెబ్బ
తాజాగా- అమెరికాలోని డల్లాస్ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జ్యోతి ప్రజ్వలన చేయడానికి నిరాకరించారనే విషయాన్ని అడ్డుగా పెట్టుకుని ఆయనపై హిందూ వ్యతిరేకి ముద్ర వేయాలంటూ బీజేపీ చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయని అంటున్నారు. నాటా సదస్సు ప్రారంభానికి ముందు ప్రతినిధులు ఏర్పాటు చేసిన దీపపు సమ్మెలో ఎలక్ట్రానిక్ లైట్లు ఉంచారనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా.. దానికి సంబంధించిన వీడియోను అధికారికంగా ట్వీట్ చేయడం పట్ల అభాసుపాలయ్యామనే అసంతృప్తి బీజేపీ నేతల్లో వ్యక్తమౌతోంది. దీనికి ప్రధాన కారకుడు సీఎం రమేషేనని అంటున్నారు. జ్యోతి ప్రజ్వలన చేయడానికి ముందుకొచ్చిన వైఎస్ జగన్ దాన్ని వెలిగించకుండా వెనక్కి వెళ్లిన వీడియో క్లిప్ ను సీఎం రమేష్ తన అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దాన్ని ఏపీ బీజేపీ నాయకులు వైరల్ చేశారు.
నియంత్రించలేకపోతున్న కన్నా..
అసలు విషయం తెలుసుకోకుండా ఆ వీడియోను వైరల్ చేయడం వల్ల పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువగా జరిగిందని అంటున్నారు సీనియర్లు. బీజేపీ చేసిన ఈ ట్వీట్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం నాయకులు పెద్ద ఎత్తున చెలరేగిపోయిన విషయం తెలిసిందే. చంద్రబాబు తన హయాంలో బూట్లు వేసుకుని మరీ పూజలు చేసినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదంటూ నిలదీస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను సాక్ష్యాధారాలుగా చూపారు. వాటిని బీజేపీకి ట్యాగ్ చేశారు. సీఎం రమేష్ చేసిన పని కాస్తా బెడిసి కొట్టడంతో దానికి పార్టీ రాష్ట్ర నాయకత్వం సమాధానం ఇచ్చుకోవాల్సి వస్తోందని సీనియర్లు వాపోతున్నారు. క్షేత్రస్థాయి క్యాడర్ లో అసంతృప్తి వ్యక్తమౌతోందని చెబుతున్నారు. వారిని నియంత్రించాలంటూ పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై ఒత్తిడి తెచ్చినప్పటికీ..ఆయన పెద్దగా దృష్టి పెట్టలేదని తెలుస్తోంది. దీనితో బీజేపీలో చాలాకాలం నుంచి కొనసాగుతున్న నాయకులు పార్టీని వీడాలనే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.