ఇంత బతుకు బతికి ఇంటెనక ఏదో ఐనట్టు..! ఇంత చేసినా ఏపీలో బీజేపి గెలిచేది ఆ నాలుగు సీట్లే...!!
ఒక వూరి రాజు మరో వూరికి బంట్రోతు అంటే ఇదే..! దేశ వ్యాప్తంగా మోదీ అనుకూల పవనాలు వీస్తున్నాయని చెప్పుకుంటున్నబీజేపి అగ్రనాయకత్వం ఏపీ విషయాలనికి వచ్చే సరికి బొక్కబోర్లా పడుతోంది. జాతీయ స్థాయి కమల నాథులు ఏపీలో ఎంత చేసినా బీజేపి అనుకూల పవనాలు కాదు కదా మామూలు గాలి కూడా ఏపీ లో ప్రభావం చూపదని నిర్ధారణ జరుగుతోంది. ఎన్నిలక ముందు ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపి ప్రదర్శిస్తున్న తీరును రాష్ట్రాన్ని విడదీసిన కాంగ్రెస్ పార్టీకన్నా ఘోరంగా పరిగణిస్తున్నారు ఏపి ప్రజలు. కాంగ్రెస్ ను విలన్ గా చిత్రీకరించి అదఃపాతాళానికి తోసేసిని ఏపి ప్రజలు అంతకన్నా రెట్టింపు కసిని చూపించేందుకు సమయం కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి తరుణంలో బీజేపి ఏపిలో పాగా వేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు అత్యంత దారుణంగా బెడిసికొట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఏపి ప్రజలు.
ఏపిలో పసుపు జెండా పటిష్టం..! కాషాయం కకావికలమే..!
ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ పరిస్థితి దారుణంగా తయారయింది. విభజన హామీల అమలు విషయంలో మాట తప్పిందనే కారణంతో ఆ పార్టీని ఏపీ ప్రజలు ద్వేషించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమపై ఉన్న అపవాదును పోగొట్టుకునేందుకు ఆ పార్టీ ఎంతగానో ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడిని నియమించడంతో పాటు పలు కీలక నిర్ణయాలను తీసుకుంది బీజేపీ అధిష్టానం. గత ఎన్నికల్లో టీడీపీతో కలిసి పని చేసిన ఆ పార్టీ ఇప్పుడు ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోమని చెబుతోంది. విభజన హామీల అమలు, రాష్ట్రానికి ఇచ్చిన నిధులు, సంక్షమ పథకాలు ఏపీ లో ప్రభావం చూపిస్తాయని స్థానికి బీజేపి నాయకులు చెప్పుకొస్తున్నారు.
ఏపీలో వాస్తవ పరిస్థితులను అంచనా వేయలేకపోతున్న బీజేపి..! అబాసుపాలు కాక తప్పదు..!
నేతల తీరు ఒక రకంగా ఉంటే క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులు మరోలా ఉన్నాయని తెలుస్తోంది. హత్య చేసిన వాడికన్నా దాన్ని చూస్తూ స్పందించని వాడు అసలైన దోషి అన్నట్టు విభజన హామీలు అమలు చేయని బీజేపిని ఏపి ప్రజలు విలన్ లా అభివర్ణిస్తున్నారు. ఇవన్ని పట్లని బీజెపి నేతలు వచ్చే ఎన్నికల్లో పొత్తులతో ముందుకు వెళ్తామని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. నిజానికి రాష్ట్రంలో బీజేపీ పరిస్థితిని చూస్తున్న మిగతా ఏ పార్టీ కూడా పొత్తుకు ఆసక్తి చూపడంలేదు. దీంతో ఆ పార్టీ వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా ప్రభావం చూపించి, రాష్ట్రంలో బలపడాలని భావిస్తోంది. అయితే, బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను అధికార తెలుగుదేశం పార్టీ గట్టిగా తిప్పుకొడుతుండడంతో ఆ పార్టీ పరిస్థితి మరింత దిగజారిపోతోంది. ఇలాంటి సమయంలో బీజేపీకి బూస్టునిచ్చే వార్త ఒకటి బయటికొచ్చింది.
చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు..! ఉద్దండుల సమక్షంలో నామమాత్రపు ఊరట..!!
వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీకి అనుకూల ఫలితాలే వస్తాయనేది ఆ వార్త సారాంశం. ఇటీవల ఓ సర్వే సంస్థ ఏపీలో బీజేపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది..? వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి..? అనే దానిపై సర్వే నిర్వహించిందట. ఆ సర్వేలో బీజేపీకి అనుకూల ఫలితాలు వచ్చాయని సర్వే సంస్థ తెలిపింది. రానున్న ఎన్నికల్లో బీజేపీ రెండు ఎంపీ స్థానాలు, రెండు అసెంబ్లీ స్థానాలను గెలుచుకోబోతుందని సర్వే సంస్థ వెల్లడించింది. దీంతో ఇప్పటినుండి ఏపిలో మరికొంచెం కష్టపడితే ఇంకా ఎక్కువ సీట్లు గెలవొచ్చని ప్రణాళిక రచిస్తోంది ఏపి బీజేపి.
ఎందుకు ఆ నాలుగు స్థానాల్లో గెలుస్తున్నారో ఎవరికి తెలియదు..! అంతా సస్పెన్స్..!!
అయితే ఆ రెండు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏ యే నియోజక వర్గాల్లో గెలవబోతున్నారో అనే అంశం మాత్రం సస్పెన్స్ గా ఉంచారు బీజేపి నాయకులు. ఈ ఫలితాలతో బీజేపీ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికి మరో పక్క ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఇప్పుడే పరిస్థితి ఇలా ఉందంటే క్షేత్ర స్థాయిలో సంస్థాగతంగా బలోపేతం ఐతే ఎన్నికల సమయానికి మరిన్ని సీట్లు పెరిగే అవకాశం ఉంటుందని ఆ పార్టీ అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీతో మద్దతుతో పోటీ చేసిన బీజేపీ రాష్ట్రంలో రెండు పార్లమెంట్ స్థానాలను, ఐదు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఇప్పుడు ప్రచారంలోకి వచ్చిన ఈ సర్వే వివరాల ప్రకారం ఏ నియోజకవర్గంలో ఎందుకు గెలవబోతున్నామనే అంశం నిజస్వరూపం తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.