వైఎస్ జగన్ సొంత జిల్లాలో బీజేపీ-జనసేన అభ్యర్థి ఏకగ్రీవం: వైసీపీ ఎమ్మెల్యేకు ఝలక్.. !
కడప: స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ-జనసేన పార్టీ అనూహ్య ఫలితాలను సాధిస్తున్నాయి. అంచనాలకు మించి విజయాలను నమోదు చేస్తున్నాయి. పలు జిల్లాల్లో ఈ రెండు పార్టీలు బలపరిచిన అభ్యర్థులు ఘన విజయాలను సాధిస్తున్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప కూడా దీనికి మినహాయింపు కాదు.
మినిట్ టు మినిట్: మాచర్లకు ఎందుకెళ్లారు? ఎలా వచ్చారు? బోండా ఉమా, బుద్ధా కాల్డేటా చెక్
కడప జిల్లా రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని వీరబల్లి మండలం మట్లిలో బీజేపీ-జనసేన ఎంపీటీసీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసిన రావూరి శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. అటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గానీ, ఇటు తెలుగుదేశం నుంచి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఫలితంగా- రావూరి శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. రావూరి శ్రీనివాస్ అభ్యర్థిత్వానికి వైఎస్ఆర్సీపీ, టీడీపీ కూడా మద్దతు ఇవ్వడం వల్లే ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారని తెలుస్తోంది.
రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డితో రావూరి శ్రీనివాస్కు మంచి సంబంధాలు ఉన్నాయని కూడా తెలుస్తోంది. అందుకే శ్రీకాంత్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ తరఫున ఎవరూ నామినేషన్ను దాఖలు చేయలేదని చెబుతున్నారు. ఇదివరకు ఆయన వైఎస్ఆర్సీపీలో పనిచేశారని, వ్యక్తిగతంగా మంచి పేరు ఉందని అంటున్నారు. పార్టీ ఏదైనప్పటికీ రావూరి శ్రీనివాస్ విజయం సాధించాలనే ఉద్దేశంతోనే వైఎస్ఆర్సీపీ క్యాడర్ కూడా ఆయనకు సహకరించిందని చెబుతున్నారు.
రావూరి శ్రీనివాస్ ఏకగ్రీవంగా విజయం సాధించడం పట్ల భారతీయ జనతా పార్టీ హర్షం వ్యక్తం చేసింది. తాము బలపరిచిన అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఘన విజయాలను నమోదు చేస్తున్నారని పేర్కొంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలనపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొందని విమర్శించింది. ప్రభుత్వం తీసుకుంటోన్న నిర్ణయాల పట్ల క్షేత్రస్థాయిలో వ్యతిరేకత ఉందనే విషయాన్ని స్థానిక సంస్థల ఎన్నికలు ప్రస్ఫూటిస్తున్నాయని పేర్కొంది. అధికార మదంతో బలవంతంగా కొన్ని చోట్ల ఏకగ్రీవ విజయాలను సాధించిందని ఆరోపించింది.