10న రాష్ట్రానికి బీజేపీ చీఫ్ జేపీ నడ్డా: టీడీపీకి డేంజర్ బెల్స్: మరిన్ని చేరికలకు ఛాన్స్..సీమ నుంచి.
అమరావతి: రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీ క్రమంగా బలపడుతోంది. తెలుగుదేశం నుంచి ఇప్పటికే పెద్ద ఎత్తున వలస వచ్చిన నాయకులతో, గాంధీ సంకల్ప యాత్రలతో ఉరకలు వేస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నికల నాటికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశానికి ధీటుగా ఎదుగుతామని, ఈ రెండింటికీ ఏకైక ప్రత్యామ్నాయంగా ఆవిర్భవిస్తామంటూ బీజేపీ రాష్ట్ర శాఖ నాయకులు తరచూ చెబుతున్నారు. దీనికి అనుగుణంగానే వారు కార్యాచరణను రూపొందించుకున్నట్లు కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి మరింత మందిని ఆకర్షించడానికి వ్యూహాలను రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టిన తరువాత జేపీ నడ్డా రాష్ట్రానికి రానుండటం ఇదే తొలిసారి.
10న రాష్ట్రానికి బీజేపీ చీఫ్..
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల 10వ తేదీన రాష్ట్రానికి రానున్నట్లు సమాచారం. బూత్ స్థాయి పార్టీ కార్యకర్తలు, నాయకులతో బీజేపీ రాష్ట్ర శాఖ నాయకులు ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని తెలుస్తోంది. ఈ సందర్భంగా జేపీ నడ్డా సమక్షంలో భారీ ఎత్తున చేరికలను చేపట్టడానికి సమాయాత్తమౌతున్నారు. జేపీ నడ్డా చేతుల మీదుగా కొందరు తటస్థులతో పాటు తెలుగుదేశం పార్టీలో అసంతృప్తిగా ఉన్న నాయకులకు కాషాయ కండువాలను కప్పడానికి ఏర్పాట్లను చేస్తున్నట్లు చెబుతున్నారు.
రాయలసీమ నుంచి..
తెలుగుదేశం పార్టీకి చెందిన రాయలసీమను కొంతమందిని చేర్చుకోవడానికి బీజేపీ పచ్చజెండా ఊపిందని, వారంతా జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీ తీర్థాన్ని పుచ్చుకోవడం ఖాయమైందని అంటున్నారు. మాజీమంత్రి భూమా అఖిల ప్రియ, శ్రీశైలం మాజీ ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్ రెడ్డి సహా మరి కొందరు బీజేపీలో చేరడానికి ఏర్పాట్లు చేస్తున్నారని అంటున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన టీడీపీ అభ్యర్థులు కూడా క్యూలో ఉన్నారనే తెలుస్తోంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు- రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులను పార్టీలో చేర్చుకోవడం ద్వారా వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీలను బలహీన పర్చేలా పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు.
ఆదినారాయణ రెడ్డికి ప్రాధాన్యత..
తెలుగుదేశానికి చెందిన మాజీ మంత్రి, జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కొద్దిరోజుల కిందటే జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు. టీజీ వెంకటేష్ తరువాత ఈ మధ్యకాలంలో రాయలసీమ నుంచి టీడీపీలో చేరిన వారిలో ఆదినారాయణ రెడ్డి ఒక్కరే పేరున్న నాయకుడు. టీజీ వెంకటేష్ తన వ్యాపారాలను తాను చూసుకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆదినారాయణ రెడ్డికి రాయలసీమ బాధ్యతలను అప్పగించాలని బీజేపీ రాష్ట్ర శాఖ నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుడు, కడప సహా రాయలసీమలోని మిగిలిన మూడు జిల్లాల్లో అదే సామాజిక వర్గానికి చెందిన నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉండటం వల్ల చేరికల బాధ్యతను ఆయనకు అప్పగించినట్లు తెలుస్తోంది.
ఆది చొరవతోనే..
ఆదినారాయణ రెడ్డి చొరవతోనే ఇన్నాళ్లూ ఏ నిర్ణయాన్ని తీసుకోకుండా తటస్థంగా ఉండిపోయిన తెలుగుదేశం మాజీలను బీజేపీలోకి తీసుకుని రావడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు. భూమా అఖిల ప్రియ, ఆమె సోదరుడు భూమా బ్రహ్మానంద రెడ్డితో పాటు గౌరు చరితా రెడ్డితో సైతం బీజేపీ నాయకులు మంతనాలు చేస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ నెల 10వ తేదీన రాష్ట్రానికి రానున్న జేపీ నడ్డా సమక్షంలో పెద్ద ఎత్తున చేరికలను నిర్వహించడానికి సర్వశక్తులను ఒడ్డుతున్నారని చెబుతున్నారు. ఇంకా సమయం ఉన్నందున.. టీడీపీ మాజీ నాయకులను ఒప్పించే బాధ్యతను ఆదినారాయణ రెడ్డికి అప్పగించినట్లు తెలుస్తోంది.