ఐటీగ్రిడ్ కేసు ఏమైంది..? అశోక్ను ఎందుకు విచారించరు, జగన్కు కన్నా లక్ష్మీనారాయణ లేఖ
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ప్రభుత్వానికి ప్రజల గోడు పట్టదా అని మండిపడ్డారు. ఐటీ గ్రిడ్ కేసు సంగతి ఏమయయిందని ప్రశ్నించారు. కేసుపై పలు అనుమానాలను లేవనెత్తుతూ ముఖ్యమంత్రి జగన్కు శనివారం కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. కేసుకు సంబంధించి లేఖలో పలు ప్రశ్నలు సంధించారు.
ఐటీగ్రిడ్..
ఎన్నికలకు ముందు ఏపీలో ఐటీగ్రిడ్ కేసును ఉదరగొట్టించారు. ఆ కేసు ఊసు ఏమయ్యిందని కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. డేటా చోరీ కేసు ఆటకెక్కినట్టేనా అని అడిగారు. దాదాపు 7 కోట్ల మంది వివరాలు చోరీకి గురైన సంగతి తెలిసింది. ఇది అప్పట్లో సంచలనం సృష్టించింది. కేసు విచారణ ఆటకెక్కడంతో కన్నా లక్ష్మీనారాయణ సీఎం జగన్కు లేఖాస్త్రం సంధించారు.
ఆరునెలలుగా..
ఏపీలో ప్రభుత్వం ఏర్పడి ఆరునెలలవుతుందని కన్నా లక్ష్మీనారాయణ గుర్తుచేశారు. ఈ సమయంలో జగన్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. ఏమీ చేయలేదని ప్రజావేదిక కూల్చడం, కాంట్రాక్టు రద్దు చేయడానికి సమయం సరిపోయిందని ఆరోపించారు. అంతే తప్ప ప్రజా సమస్యలను కూడా పట్టించుకోలేదని విమర్శించారు. ప్రజలకు సంబంధించిన డేటా కేసును కూడా జగన్ ప్రభుత్వం గాలికొదిలేసిందని విమర్శించారు.
ప్రశ్నించర..
ఇప్పటివరకు ఐటిగ్రిడ్ అశోక్ను ఎందుకు ప్రశ్నించలేదని కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. ఆయనను విచారణ చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటని నిలదీశారు. ప్రజల వ్యక్తిగత వివరాల గోప్యతపై ప్రభుత్వం ఎందుకు ఉదాసీనంగా ఉందని అడిగారు. ఇది సరికాదని, వెంటనే అశోక్, ఇతర నేరస్తులను అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసు విచారణ త్వరితగతిన పూర్తిచేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ విషయం
మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో ఐటీగ్రిడ్ సంస్థను ఏర్పాటుచేశారు. సేవామిత్ర మొబైల్ యాప్తో ఓటర్ల డేటా సేకరించారు. ఏపీలో నియోజకవర్గాల వారీగా ఓటరు జాబితా తీసుకొని.. సేవామిత్ర యాప్లో పేర్లను ఫీడ్ చేశారు. పేరు, కులం, మతం, ఆధార్ నంబర్, సెల్ ఫోన్ నంబర్ వివరాలను పొందుపరిచేలా ఫార్మాట్ తయారు చేశారు. ప్రభుత్వ పథకాలు అందుకుంటున్న లబ్దిదారుల వివరాలు, వారు ఏ పార్టీపై సానుకూల అభిప్రాయంతో ఉన్నారని 15 ప్రశ్నలతో ప్రశ్నావళి కూడా రూపొందించారు. వైసీపీతోపాటు ఇతర పార్టీల వైపు మొగ్గుచూపే ఓటర్ల జాబితాను సిద్ధం చేసి.. తమకు మరో చోట ఓటు ఉందని రద్దుచేశారు.