'గుట్టకు వంద కోట్లిచ్చి, భద్రాచలంకు రూ.100 ఇవ్వని కేసీఆర్'
వరంగల్/ఖమ్మం/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ఆదివారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. యాదగిరిగుట్టకు రూ.100 కోట్లు కేటాయించిన కేసీఆర్.. భద్రాచలంకు రూ.వంద ఇవ్వలేదని కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు.
చారిత్రక దేవాలయాన్ని కేసీఆర్ విస్మరించారన్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి అంతా ఫిరాయింపులను ప్రోత్సహించడమే అన్నారు. మాట తప్పడం కేసీఆర్ నైజమని కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య వేరుగా అన్నారు. వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయ పథకాల ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
బీసీలకు అధ్యక్ష పదవి ఇవ్వాలి: పొన్నం ప్రభాకర్
బీసీల పైన కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే తెరాస అధ్యక్ష పదవిని బీసీలకు ఇవ్వాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలన్నారు. ఫీజు రీయింబర్సుమెంట్స్ ఇవ్వకుండా బీసీలను చదువులకు దూరం చేసే కుట్ర జరుగుతోందన్నారు. ప్రస్తుతం పునరుద్ధరిస్తున్న చెరువుల కింద భూములన్నీ పెత్తందార్లవే అన్నారు.
ఉద్యోగులను బెదిరిస్తున్నారు: కిషన్ రెడ్డి
కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులను బెదిరిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి హైదరాబాదులో అన్నారు. ఉద్యోగాల సంఘాన్ని తెరాస అనుబంధ సంస్థగా మార్చకునే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందన్నారు. 52 శాతం జనాభా ఉన్న బీసీలకు బడ్జెట్లో 2 శాతం నిధులు మాత్రమే కేటాయించారన్నారు. బీసీలకు అన్యాయం చేయాలని చూస్తే పోరాటం తప్పదన్నారు.