'పవన్-జగన్తో కలిసి ప్రభుత్వంపై మహా కుట్ర, అందుకే ఏడీఆర్!, బాబు కోసం ఢిల్లీలో ఎదురుచూపు'
అమరావతి: బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు కలిసి టీడీపీ ప్రభుత్వంపై మహా కుట్రకు పన్నాగం పన్నారని టీడీపీ నేత, ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర రావు ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎన్డీయే నుంచి బయటకు వచ్చిందని జూపూడి చెప్పారు. హోదా కోసం చంద్రబాబు ఉద్యమిస్తుండటంతో బీజేపీ, వైసీపీలు కొత్త నాటకానికి తెరలేపాయన్నారు.
Recommended Video
బాబు ఎఫెక్ట్, గవర్నర్తో మోడీ భేటీ రద్దు?: 'ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా అని చంద్రబాబును అడిగా'
ఏడీఆర్ సంస్థ పేరుతో రాకేష్ రెడ్డి అసత్య ప్రచారం
ఇందులో భాగంగా ఏడీఆర్ సంస్థ పేరుతో రాకేష్ రెడ్డి అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులున్నట్లుగా ఆరోపిస్తూ అసత్యప్రచారాన్ని చేపట్టారని జూపూడి మండిపడ్డారు. అచ్చెన్నాయుడు, బండారు సత్యనారాయణమూర్తి, దేవినేని ఉమా తదితరులపై గతంలో నమోదైన కేసులన్నింటినీ కోర్టు కొట్టివేసినప్పటికీ ఇంకా ఉన్నాయని ఆరోపిస్తుండడం సరికాదన్నారు.
వైసీపీ నాయకుల పేర్లు చెప్పలేదేమిటి?
12 కేసుల్లో ముద్దాయిగా ఉన్న వైయస్ జగన్, ఆ పార్టీ నాయకులు విజయ సాయి రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు గోవర్ధన్రెడ్డి, శ్రీధర్ రెడ్డి, అనిల్ కుమార్, చెవిరెడ్డి భాస్కర రెడ్డి, రోజా తదితరులపై నమోదైన వివిధ కేసుల విషయాన్ని ఏడీఆర్ సంస్థ ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.
వైసీపీ పోటీయే కాదు
కేంద్రంపై పోరాటం చేయాల్సిన సమయంలో బీజేపీతో కుమ్మక్కై జగన్ దొంగయాత్రలు చేస్తున్నారని ఎంపీ కొనకళ్ల నారాయణ మండిపడ్డారు. ప్రధాని మోడీని విమర్శించకుండా కేంద్రంపై పోరాటం చేస్తున్న టీడీపీని విమర్శించడం అందులో భాగమన్నారు. కేసుల నుంచి బయటపడేందుకే వైసీపీ నేతల ప్రయత్నమన్నారు. వైసీపీపై ప్రజలకు విశ్వాసం లేదన్నారు. టీడీపీకి వైసీపీ పోటీయే కాదన్నారు.
బీజేపీది అందెవేసిన చేయి
ఎదుటి పార్టీలపై దాడి చేసి, కక్ష సాధింపు చర్యలకు పాల్పడటంలో బీజేపీది అందెవేసిన చేయి అని కొనకళ్ల మండిపడ్డారు. ఏపీకి న్యాయం చేయమని అడిగితే కక్ష కట్టి అబద్దపు కేసులు పెట్టి పగతీర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ పారదర్శక పాలన అందిస్తోందన్నారు. బెదిరింపులకు భయపడేది లేదన్నారు. హామీలు అమలు చేయకపోవడం ప్రధాని మోడీ అసమర్థత అన్నారు.
బాబు నాయకత్వం కోసం జాతీయ నేతలు ఎదురుచూపు
జాతీయంగా చాలామంది నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారని, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసైనా సరే బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని కొనకళ్ల చెప్పారు. విభజన హామీలు అమలుచేస్తే టీడీపీ తిరిగి ఎన్డీయేలో చేరుతుందా? అన్న కేంద్రమంత్రి రామదాస్ అథవాలే వ్యాఖ్యలపై స్పందిస్తూ.. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభమన్నారు. విభజన చట్టంలోని హామీలన్నింటిని పూర్తిగా నెరవేరిస్తే అప్పుడు ఆలోచిస్తామన్నారు.