అమరావతి రాజధాని మార్పుకు వ్యతిరేకంగా బీజేపీ కోర్ కమిటీ తీర్మానం, కేంద్రానికి ప్రతిపాదన..
అమరావతి రాజధాని మార్పును ఏపీ బీజేపీ కూడా వ్యతిరేకిస్తోంది. తొలుత ప్రభుత్వ ప్రతిపాదనపై సానుకూలంగా కనిపించిన కమలదళం తర్వాత మాట మార్చింది. రాజధాని మార్పు అంశంపై శనివారం అమరావతిలో బీజేపీ కోర్ కమిటీ సమావేశమైంది. రాజధాని మార్పు జేఏసీతో కలిసి పోరాటం చేయాలని నిర్ణయం తీసుకొన్నది. ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్, పురంధేశ్వరి, జీవీఎల్ నరసింహారావు, సోమువీర్రాజు తదితర నేతలు పాల్గొన్నారు.
కోర్ కమిటీ తీర్మానం
నవ్యాంధ్ర ప్రదేశ్ రాజధానిగా అమరావతే ఉండాలని బీజేపీ కోర్ కమిటీ తీర్మానం చేసింది. రాష్ట్ర బీజేపీ చేసిన తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రతిపాదించారు. దీనిపై బీజేపీ నేతల్లో భిన్న వాదనలు వినిపించాయి. కొందరు పంపించాలని, మరికొందరు వద్దని అనడంతో విభేదాలు బయటపడ్డాయి.
జోక్యం వద్దు
రాష్ట్ర బీజేపీ కమటీ తీర్మానంపై కేంద్ర ప్రభుత్వ జోక్యం వద్దని ఎంపీ జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. అయితే జీవీఎల్, సోము వీర్రాజు వాదనను మిగతా నేతలు తప్పుపట్టారు. అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ కేంద్ర ప్రభుత్వ ప్రమేయం కోరడంలో తప్పు లేదని సుజనా చౌదరి, సీఎం రమేశ్, పురంధేశ్వరి అభిప్రాయపడ్డారు. వీరికి కన్నా లక్ష్మీనారాయణ కూడా జతకలిసి కేంద్ర ప్రమేయం కోరడంలో తప్పులేదన్నారు.
నిధుల కేటాయింపు
రాజధాని అమరావతి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చందని సుజనా చౌదరి బృందం కోర్ కమిటీ సమావేశంలో ప్రస్తావించారు. రాజధాని కోసం వేల కోట్ల నిధులు మంజూరు చేసిందని గుర్తుచేశారు. ప్రజా రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని.. అందుకే నిధులు కేటాయించిందని తెలిపారు.