జగన్పై ఎఫెక్ట్: గవర్నర్ పాలనకు బీజేపీ, జగన్ని పొడవమని వైసీపీ నేతలే కత్తి ఇచ్చారేమో: జలీల్ఖాన్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై దాడిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి శుక్రవారం అన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సింగిల్ జడ్జితో గానీ సీబీఐ చేత కానీ విచారణ జరిపించాలన్నారు.
ఆపరేషన్ గరుడలో చెప్పినట్లే, ప్రభుత్వాన్ని కూల్చాలనే: గవర్నర్పై బాబు తీవ్ర విమర్శలు
శివాజీని అమెరికా ఎందుకు పంపించారు?
తెలుగుదేశం పార్టీ నేతల మాటలు సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయని విష్ణువర్ధన్ విమర్శించారు. ఆపరేషన్ గరుడ అంటే ఎవరు చెప్పాలని ప్రశ్నించారు. నటుడు శివాజీని అమెరికాకు ఎందుకు పంపించారో చెప్పాలని నిలదీశారు.
పవన్ పైన దాడి జరిగినా ఇలాగేనా?
రేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన దాడి జరిగితే ఆపరేషన్ గరుడ అంటారా అని విష్ణువర్ధన్ వ్యాఖ్యానించారు. గవర్నర్ నరసింహన్ను విమర్శించే నైతిక హక్కు, స్థాయి తెలుగుదేశం పార్టీ నేతలకు లేదని అన్నారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని తాము డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.
చంద్రబాబును బర్తరఫ్ చేయాలి
ముఖ్యమంత్రిగా చంద్రబాబు అనర్హుడు అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. చంద్రబాబును బర్తరఫ్ చేయాలని గవర్నర్ను డిమాండ్ చేశారు. క్యాంటీన్ ఓనర్ టీడీపీ నేత కాబట్టి ఆయనను విచారించలేదని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ సిట్ పైన తమకు ఏమాత్రం నమ్మకం లేదని చెప్పారు. సీబీఐ విచారణ జరిపించాలని కోర్టును కోరామని చెప్పారు.
జగన్ను పొడవమని వైసీపీ నేతలో కత్తి ఇచ్చినట్లుగా ఉంది
జగన్ పైన దాడి విషయమై టీడీపీ నేత, ఎమ్మెల్యే జలీల్ ఖాన్ స్పందించారు. జగన్ను పొడవమని వైసీపీ నేతలే ఆ యువకుడికి కత్తి ఇచ్చినట్లుగా ఉందని చెప్పారు. జగన్ వంటి నేతపై కత్తితో దాడి జరిగితే అతడిని చితకబాదకుండా, పోలీసులకు అప్పగించేంత సహనం వైసీపీకి ఉందా అని ప్రశ్నించారు. గతంలో ఏపీ అభివృద్ధిని జగన్ మాత్రమే అడ్డుకునేవారని, ఇప్పుడు ముగ్గురు జగన్, పవన్, బీజేపీ అడ్డుకుంటున్నారని చెప్పారు. బీజేపీతో కలిసి రాష్ట్రంలో అలజడులు రేపేందుకు పవన్, జగన్ కలిసి కుట్ర పన్నారన్నారు.