టీడీపీది సిగ్గులేని తనం, 2019లో ప్రజలే బాబుపై కక్ష సాధిస్తారు: జీవీఎల్
న్యూఢిల్లీ/అమరావతి: నవ్యాంధ్ర రాజకీయాల్లో కొన్ని రోజుల్లోనే అనూహ్య మార్పులు చోటు చేసుకోబోతున్నాయని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు అన్నారు. కేంద్రం చేసిన సహాయాన్ని తమ ఖాతాలో వేసుకుని బీజేపీని దోషిగా నిలబెడుతున్నారని ఆయన మండిపడ్డారు.
గడిచిన కొద్ది నెలలుగా టీడీపీ ప్రభుత్వం ఏకపక్ష ప్రచారం చేస్తూ వస్తోందని.. దాన్ని తిప్పికొట్టి ప్రజాకోర్టులో ఆ పార్టీ తీరును ఎండగడుతామని అన్నారు. పరిశ్రమలు, వ్యవసాయం, గృహ నిర్మాణం... ఇలా ఏ రంగంలో చూసినా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి అంతా కేంద్రం చేసిన సహాయం వల్లే సాధ్యపడిందని చెప్పారు.
కేంద్రం చేస్తున్న సహాయాన్నిఎక్కడా చెప్పకుండా... అంతా తన ఖాతాలో వేసుకోవడం టీడీపీ సిగ్గులేనితనమని మండిపడ్డారు. కర్ణాటకలో బీజేపీని ఓడించేందుకు శతవిధాలుగా ప్రయత్నించారని, ఉద్యోగులను కూడా వాడుకుంటున్నారని జీవీఎల్ ఆరోపించారు. అక్కడ తమ విజయం ఇప్పటికే పరిపూర్ణమైందని చెప్పుకొచ్చారు.
అసలే ఏపీలో పరిపాలన గాడి తప్పి అధోగతి పాలైందని, ఇలాంటి తరుణంలో ఉద్యోగులను రాజకీయాల్లోకి దింపితే ప్రజల పట్ల వారికి ఎలాంటి బాధ్యత ఉంటుందని ఆయన ప్రశ్నించారు. కేంద్రం ఇస్తున్న నిధులతో సీఎం చంద్రబాబు విలాసాల దీక్షలు చేస్తున్నారని, ఆయన విదేశీ యాత్రలు చేయకుండా.. ఆ నిధుల్ని వ్యవసాయానికి కేటాయిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతున్న సమస్యలన్ని వచ్చే ఎన్నికల్లో టీడీపీని కూడా వెంటాడుతాయని జీవీఎల్ హెచ్చరించారు. టీడీపీ అహంకారం, తప్పుడు నిర్ణయాల వల్ల బీజేపీకి ఎలాంటి నష్టం లేదని అన్నారు. చంద్రబాబుపై ప్రజలే కక్ష సాధిస్తారని చెప్పారు. కేంద్రం పన్ను రాయితీ ఇవ్వకుముందు రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు?.. ఇప్పుడెన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు? అన్న వివరాలను ప్రజలను ముందు ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇక ఏపీలో రాజకీయాలను ప్రభావితం చేయడానికి తమకు ఎక్కువ సమయమేమి పట్టదని జీవీఎల్ అన్నారు. మూడు నుంచి ఆరు నెలల్లో పరిస్థితులను ప్రభావితం చేసే స్థాయికి బీజేపీ ఎదుగుతుందని, అందుకు అనుగుణంగా తాము ప్లాన్ చేస్తున్నామని అన్నారు.