జగన్ తీసుకున్న ఆ నిర్ణయం బీజేపీ తీసుకోలేదు .. ఎందుకంటే
ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి.. బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలోనే సంచలన నిర్ణయం తీసుకొని దేశం దృష్టిని ఆకర్షించారు. ఫిరాయింపులపై తన కచ్చితమైన నిర్ణయాన్ని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. మరి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరహాలో బిజెపి కూడా ఫిరాయింపులపై స్టాండ్ తీసుకుంటుందా అంటే కచ్చితంగా కష్టమనే చెప్పాలి. అందుకు కారణం లేకపోలేదు.
కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో వైసీపీ అధికారం .. కానీ జగన్ నిర్ణయం సంచలనం
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. కేంద్రంలో గత అయిదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ కే మరోమారు దేశ ప్రజలు పట్టం కట్టారు. ఇక బిజెపి సర్కార్ ను ఓడించాలని భావించిన చాలా ప్రాంతీయ పార్టీలు చావు దెబ్బ తిన్నాయి. అలాంటి పార్టీల్లో టిడిపి ఒకటి. ఏపీలో గతంలో అధికారంలో ఉన్న టీడీపీ ఈసారి ఎన్నికల్లో ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంది. కేవలం ఇరవై మూడు స్థానాలకు పరిమితమై టిడిపి చావు దెబ్బ తింది. ఇక వైసీపీ 151 స్థానాలతో విజయకేతనం ఎగురవేసి అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇక రాష్ట్రంలో సీఎంగా పాలన చేపట్టిన వైయస్ జగన్మోహన్ రెడ్డి సరికొత్త నిర్ణయాలతో ఏపీలో పాలనను పరుగులు పెట్టిస్తున్నారు.
ఫిరాయింపులపై సంచలన నిర్ణయం తీసుకున్న జగన్ .. సరికొత్త రాజకీయ మార్పులకు శ్రీకారం
అంతేకాదు దేశవ్యాప్తంగా అన్ని పార్టీల నుండి పెద్ద ఎత్తున ఫిరాయింపులు చోటు చేసుకున్న సందర్భంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీలోకి ఏ పార్టీ నుండి నేతలు రావాలన్నా పదవులకు రాజీనామా చేస్తేనే పార్టీలో చేర్చుకుంటామని అసెంబ్లీ వేదికగా తేల్చి చెప్పారు. అంతేకాదు ఎవరైతే పదవులకు రాజీనామా చేయకుండా పార్టీ మారతారో వారిపై అనర్హత వేటు వేయాలంటూ ఆయన సంచలన నిర్ణయం ప్రకటించారు. ఇక ఈ నేపథ్యంలో జగన్ తీసుకున్న నిర్ణయం సరికొత్త రాజకీయ మార్పులకు శ్రీకారం చుట్టినట్టు ఉండటంతో జగన్ దేశం దృష్టిని ఆకర్షించారు.
దక్షినాదిపై దృష్టి సారించిన బీజేపీ .. ఫిరాయింపులపై జగన్ తరహా నిర్ణయం తీసుకుంటుందా ?
ఇక ఇదే సమయంలో దేశంలో అధికారంలోకి వచ్చిన బిజెపి దక్షిణాది పై దృష్టి కేంద్రీకరించింది. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడానికి నిర్ణయించిన బీజేపీ అందులో భాగంగా వివిధ పార్టీల నుండి బలమైన నేతలు తమ పార్టీలో చేర్చుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది. ఇక తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటలేకపోయిన బీజేపీ లోక్ సభ ఎన్నికల్లో మాత్రం నాలుగు స్థానాలు గెలిచి సత్తా చాటింది. ఇక దీంతో బీజేపీలో కొత్త ఉత్సాహం నెలకొంది . పార్టీని బలోపేతం చేస్తే భవిష్యత్ లో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతామనే ఆశలు చిగురించాయి. ఇక ఈ నేపధ్యంలోనే బీజేపీ అధిష్టానం తెలంగాణా రాష్ట్రంపై దృష్టి సారించనుంది అని బీజేపీ శ్రేణులు చెప్తున్నారు. ఇక ఏపీ లోనూ ముఖ్యంగా టీడీపీ టార్గెట్ గా బీజేపీ పావులు కదుపుతుంది . ఇక తెలుగు రాష్ట్రాల నుండి టీడీపీలోనూ కాంగ్రెస్ లోనూ గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు బిజెపి లోకి చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
జగన్ లా సాహసం చెయ్యటం బీజేపీకి కష్టమే .. అందుకే ఫిరాయింపులపై బీజేపీ ఆ నిర్ణయం తీసుకోదు
అయితే బిజెపి మాత్రం జగన్ తరహా నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా లేదు. రాజీనామాలు చేస్తేనే పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకునే ఆలోచన బీజేపీకి లేదు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయాలి అంటే సాధ్యమైనంతవరకు వివిధ పార్టీల నుండి గెలిచిన నాయకులనే పార్టీ లో చేర్చుకోవాలి. ఇక వారితో రాజీనామాలు చేయించి తిరిగి గెలిపించుకోవడం అంటే బిజెపికి కత్తి మీద సామే. కాబట్టి బిజెపి జగన్ తరహా నిర్ణయం ఫిరాయింపుల విషయంలో తీసుకోలేదు. జగన్ తరహా నిర్ణయం తీసుకోవడంలో బిజెపి నే కాదు, చాలా ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు సైతం వెనకడుగు వేస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.