పోలవరంపై విచారణ ఎఫెక్ట్: మీతో మళ్లీ పొత్తా..అమిత్ షా ఏం చెప్పారో మరిచారా? చంద్రబాబుపై బీజేపీ ఫైర్
రాజమహేంద్రవరం: అసెంబ్లీ, ,లోక్ సభ ఎన్నికలకు ముందు కేంద్రంలో భారతీయ జనతాపార్టీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటికి వచ్చి పొరపాటు చేశామని, వీలైతే మరోసారి కాషాయ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరోక్ష సంకేతాలు పంపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకుందంటూ దాఖలైన పిటీషన్ ను ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించిన రెండు రోజుల వ్యవధిలోనే చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం సంకేతాలు ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అవినీతిపై పక్కా సాక్ష్యాధారాలు..
చంద్రబాబు పంపించిన పొత్తు సంకేతాలపై బీజేపీ రాష్ట్ర ఇన్ ఛార్జి సునీల్ దేవ్ ధర్ భగ్గుమన్నారు. పీకల్దాకా అవినీతిలో కూరుకునిపోయిన చంద్రబాబుతో గానీ, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణ వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడిందనడానికి సాక్ష్యాధారాలు ఉన్నాయని, దీనిపై న్యాయస్థానం విచారణకు ఆదేశించిందని గుర్తు చేశారు. విచారణకు ఆదేశించిన సమయంలోనే చంద్రబాబు.. తమతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
బీజేపీలో భారీగా చేరికలు..
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సునీల్ దేవ్ ధర్ పర్యటించారు. రాజమహేంద్రవరం రూరల్ పరిధిలోని తొర్రేడు, రాజవోలు గ్రామాలకు చెందిన పలువురు స్థానికులు ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి కాషాయ కండువాను కప్పి, సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలపై పార్టీ శ్రేణులతో సమీక్ష నిర్వహించారు. కేంద్రం నుంచి బయటికి వచ్చి, తప్పుచేశామంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఘాటుగా విమర్శించారు.
అమిత్ షా ఏం చెప్పారో మరిచిపోయారా?
తమ పార్టీ అధినేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఎన్నికల సమయంలో చెప్పిన విషయాన్ని ఇంత త్వరగా మరిచిపోయారా? అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీతో పొత్తులు పెట్టుకోవడానికి ద్వారాలు మరిచిపోయాయని అమిత్ షా నుంచి చంద్రబాబుకు స్పష్టమైన సమాచారం వెళ్లిందని పునరుద్ఘాటించారు. అవినీతిపరులతో పొత్తుల కోసం తమ అధిష్ఠానం ఎలాంటి ప్రయత్నాలు చేయబోదని కుండబద్దలు కొట్టారు. చంద్రబాబు అంతటి అవినీతిపరుడు, అబద్ధాల కోరు రాజకీయాల్లో లేరని, త్వరలో తామే బీజేపీతో పొత్తు పెట్టుకుబోతున్నామంటూ చంద్రబాబు మరోసారి ప్రజలను వంచిస్తున్నారని ఘాటుగా విమర్శించారు.
ప్రత్యామ్నాయం మేమే..
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉనికిని కోల్పోయే రోజులు అతి దగ్గర్లోనే ఉన్నాయని సునీల్ దేవ్ ధర్ స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయంగా తాము ఆవిర్భవించబోతున్నామని అన్నారు. తమ పార్టీలో వస్తోన్న భారీగా వస్తోన్న వలసలే దీనికి నిదర్శనమని అన్నారు. తెలుగుదేశం నుంచి మరి కొందరు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని, వారిని సాదరంగా స్వాగతిస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు అవినీతిపై దాఖలైన పిటీషన్ పై విచారణ కొనసాగితే.. తెలుగుదేశం పార్టీకి గడ్డు రోజులు తప్పవని, టీడీపీ నాయకత్వ లేమిని ఎదుర్కొంటుందని చెప్పారు.