జగన్, రఘురామతో బీజేపీ డబుల్ గేమ్- అనర్హత వేటు ఆలస్యం అందుకే-వైసీపీ ఫ్రస్ట్రేషన్
ఏపీ రాజకీయాల్లో దాదాపు శూన్యంగా కనిపిస్తున్న జాతీయ పార్టీ బీజేపీ.. ఇక్కడి ప్రాంతీయ అధికార పార్టీ వైసీపీతో పాటు ఆ పార్టీకి చెందిన రెబెల్ ఎంపీ రఘురామరాజుతోనూ సత్సంబంధాలు నెరుపుతోంది. అవసరానికి సీఎం వైఎస్ జగన్ను వాడుకుంటున్న బీజేపీ.. అటు రఘురామను అవసరం లేకున్నా ఆదుకుంటోంది. దీంతో వైసీపీ అధినాయకత్వంలో అసహనం పెరుగుతోంది. తాజాగా రఘురామరాజుపై వేటులో అసాధారణ ఆలస్యం జరుగుతోందని ఆరోపిస్తూ లోక్సభ స్పీకర్కు ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి రాసిన లేఖ లో వాడిన పదజాలమే ఇందుకు నిదర్శనం.
జగన్ను వాడేసుకుంటున్న బీజేపీ
రెండేళ్ల క్రితం ఏపీలో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ఇప్పటికీ గతంలో ఇచ్చిన ప్రత్యేక హోదాతో పాటు ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్ని కానీ సాధించుకోలేకపోతున్నారు. దీనికి కారణం ఆయనపై ఉన్న సీబీఐ కేసులేనని విపక్షాలు ఆరోపిస్తుంటాయి. అయితే కారణాలు ఏవైనా లోక్సభలో నాలుగో అతిపెద్ద పార్టీగా, రాజ్యసభలో ఆరో అతిపెద్ద పార్టీగా ఉన్న వైసీపీకి అధినేతగా ఉన్న జగన్ మాత్రం బీజేపీ పెద్దల ముందు మోకరిల్లక తప్పడం లేదు. దీంతో బీజేపీ కూడా జగన్ను ఇష్టారాజ్యంగా వాడుకుంటున్న పరిస్ధితి కనిపిస్తోంది.
బీజేపీ గుడ్లుక్స్లో రఘురామ
కేంద్రంతో రెండేళ్లుగా సత్సంబందాలు నెరుపుతున్నా ఏపీకి భారీగా నిధులు కానీ, ప్రత్యేక హోదా కానీ సాధించుకోలేకపోయిన వైఎస్ జగన్ ఇప్పటికీ విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారు. అదే సమయంలో జగన్తో సత్సంబంధాలు ఉన్నట్లు పైకి కనిపిస్తున్న బీజేపీ అటు జగన్కు బద్ధ శత్రువుగా కనిపిస్తున్న వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు విషయంలోనూ సానుకూల వైఖరితో ఉన్నట్లు అర్ధమవుతోంది. గతంలో రఘురామరాజుపై ఏపీలో కుప్పలుతెప్పలుగా కేసులు నమోదవుతున్న తరుణంలో ఆయనకు వై ప్లస్ కేటగిరీ భద్రత ఇచ్చిన కేంద్రం.. తాజాగా ఏపీ సీఐడీ రాజద్రోహం కేసులో బెయిల్ పొందాక ఢిల్లీలో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఉండేందుకు అవకాశం కల్పిస్తోంది. అంతే కాదు ఆయన అడిగిన వెంటనే కేంద్రమంత్రులు సైతం అపాయింట్మెంట్లు ఇచ్చేస్తున్నారు.
జగన్, రఘురామతో బీజేపీ డబుల్ గేమ్
అటు జగన్తో సత్సంబంధాలు నెరుపుతున్నట్లు కనిపిస్తున్న బీజేపీ పెద్దలు.. ఆయనతో సమానంగా రఘురామరాజును సైతం ఆదరిస్తున్నారు. కోరిన వెంటనే ఇద్దరికీ అపాయింట్మెంట్లు సైతం ఇచ్చేస్తున్నారు.
దీంతో పాటు జగన్ ఎప్పటినుంచో కోరుతున్నా రఘురామరాజుపై చర్యలకు కేంద్రం సిద్ధపడటం లేదు. అటు సీబీఐ వంటి దర్యాప్తు సంస్ధలు రఘురామరాజుపై నమోదైన ఎఫ్ఐఆర్లపై దూకుడుగా ముందుకు వెళ్లే పరిస్ధితులు కనిపించడం లేదు. దీంతో బీజేపీ తమ అవసరాల కోసం జగన్ను వాడుకుంటూనే, అటు జగన్పై పోరాటం చేస్తున్న రఘురామకు కూడా సహకరిస్తున్నట్లు తెలుస్తోంది.
రఘురామపై అనర్హత వేటు ఆలస్యం వెనుక?
పార్టీ లైన్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న రఘురామరాజుపై వేటు వేయాలంటూ గతేడాదే లోక్సభ స్పీకర్ను కోరిన వైసీపీ, ఆ తర్వాత కూడా పలుమార్లు ఇదే విజ్ఞప్తిని స్పీకర్ ముందుంచింది. అయినా ఇప్పటివరకూ స్పీకర్ ఓం బిర్లా కనీసం రఘురామను పిలిచి వివరణ కూడా కోరలేదంటే పరిస్ధితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో రఘురామ ఇప్పటికీ పార్టీ అధినేతగా ఉన్న జగన్ను టార్గెట్ చేస్తూ నిత్యం చెలరేగిపోతున్నారు.
దీంతో రఘురామకు ఎలా అడ్డుకట్ట వేయాలో తెలియక వైసీపీ విలవిల్లాడుతోంది. అందుకే తాజాగా మరోసారి లోక్సభ స్పీకర్కు రఘురామపై ఇప్పటికైనా వేటు వేయాలంటూ ఎంపీ సాయిరెడ్డి ఘాటుగా లేఖ రాశారు. అయితే ప్రస్తుత పరిస్ధితుల్లో రఘురామపై వేటుకు స్పీకర్ సిద్ధపడే పరిస్ధితులు మాత్రం కనిపించడం లేదు.