Vizag: బీజేపీలోనూ భిన్నాభిప్రాయాలు: కన్నా అలా..విష్ణు కుమార్ ఇలా: విశాఖకే కరెక్ట్..!
విశాఖపట్నం: రాష్ట్రంలో మూడు రాజధాననులను ఏర్పాటు చేయబోతున్నామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసన సభలో చేసిన ప్రకటన.. భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకుల్లోనూ విభేదాలకు దారి తీసింది. భిన్నాభిప్రాయాలు తలెత్తడానికి బీజం వేసింది. విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా ప్రకటించడాన్ని నిరసిస్తూ బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రెండు రోజుల కిందటే అమరావతి ప్రాంతంలో మౌన దీక్ష చేపట్టగా.. ఆయన నిర్ణయాన్ని విభేదిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు.
కన్నా దీక్షకు గైర్హాజర్ కావడానికి..
కన్నా లక్ష్మీనారాయణ చేపట్టిన మౌన దీక్షకు ఆయన హాజరు కాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా ప్రకటించడాన్ని విష్ణు కుమార్ రాజు స్వాగతిస్తున్నారని, ఈ కారణం వల్లే ఆయన కన్నా లక్ష్మీనారాయణ చేపట్టిన మౌన దీక్షకు హాజరు కాలేదంటూ వార్తలు వచ్చాయి. తాజాగా- తన వైఖరి ఏమిటో తేల్చి చెప్పారు విష్ణు కుమార్ రాజు. విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా ప్రజలు కోరుకుంటున్నారని, తానూ ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని స్పష్టం చేశారు.
విశాఖకు అన్ని అర్హతలు..
పరిపాలనా రాజధానిగా రూపుకల్పన చేయడానికి అవసరమైన అన్ని అర్హతలు, అన్ని హంగలూ విశాఖపట్నానికి ఉన్నాయని విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు. ఈ విషయంలో ఒక్క విశాఖపట్నం తప్ప మరే నగరానికీ అలాంటి అర్హతలు లేవని అన్నారు. విశాఖను రాజధానిగా ప్రకటించడం వల్ల నిర్మాణ వ్యయాన్ని సైతం నియంత్రించ వచ్చని చెప్పారు. ఇప్పటికే పరిపాలనకు అవసరమైన భవనాలు చాలా ఉన్నాయని, వాటిని ఉపయోగించుకోవడం ద్వారా కొత్త వాటిని నిర్మించుకోవాల్సిన అవసరం రాకపోవచ్చని చెప్పారు.
రివర్స్ టెండరింగ్ ద్వారా మిగిలిన నిధులతో..
పోలవరం సహా పలు ప్రాజెక్టుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ ను చేపడుతున్నారని, దీనివల్ల ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు మిగులుతున్నాయని అన్నారు. ఈ మిగులు నిధులతో రాజధాని నిర్మాణ పనులను పూర్తి చేసుకోవచ్చని విష్ణుకుమార్ రాజు చెప్పుకొచ్చారు. మూడు రాజధానులపై ప్రకటన చేసిన అనంతరం అమరావతి ప్రాంతంలో రైతులు ఆందోళనలకు దిగినప్పటికీ..వైఎస్ జగన్ నోరు విప్పట్లేదని, రాజకీయ కారణాలతోనే ఆయన మౌనాన్ని పాటిస్తున్నారని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
ఆయన మౌనమూ వ్యూహాత్మకమే..
వైఎస్ జగన్ మౌనంగా ఉండటం కూడా వ్యూహాత్మకమేనని విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు. ఇప్పుడున్న సున్నిత పరిస్థితుల్లో జగన్ ఎలాంటి ప్రకటన చేసినప్పటికీ.. అది ఇతర ప్రాంతాల ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉండొచ్చని అన్నారు. మూడు ప్రాంతాల మధ్య ఎటువంటి విభేదాలు రాకుండా ఉండేందుకే ఆయన మౌనం వహించి ఉంటారని చెప్పారు. అమరావతి ప్రాంత రైతులకు జగన్ న్యాయం చేస్తారని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు.