టీడీపీ నేతలు తినేందుకు అలవాటుపడ్డారు.. ఈఎస్ఐ స్కామ్పై బీజేపీ విమర్శలు..
ఇక మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గురించి ప్రస్తావిస్తూ.. చంద్రబాబుకు దగ్గరయ్యేందుకే గంటా బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నుంచి వందల మంది కార్యకర్తలు టీడీపీలో చేరారని ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. గంటా కారు నంబర్ 'ఒకటి' అని,అబద్దాలు ప్రచారం చేయడంలోనూ ఆయన నంబర్.1 అని విమర్శించారు. ఇలాంటి నేతలను పక్కనపెట్టుకున్నందుకే చంద్రబాబు 23 సీట్లకు పరిమితమయ్యాడని విమర్శించారు.
కాగా,తెలంగాణ తరహాలో ఆంధ్రప్రదేశ్లోనూ భారీ ఈఎస్ఐ స్కామ్ వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఈఎస్ఐకి చెందిన ముగ్గురు మెడికల్ డైరెక్టర్లు రవికుమార్,రమేష్ కుమార్,విజయ్ కుమార్లు ఐదేళ్ల కాలంలో వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం కలిగించారని విజిలెన్స్ శాఖ గుర్తించింది. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలను కూడా ఈడీ సేకరించింది. మెడిసిన్స్,ల్యాబ్ కిట్స్,బయోమెట్రిక్ మెషీన్స్,ఫర్నీచర్,ఈసీసీ సర్వీసులు,బయోమెట్రిక్ యంత్రాల కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగినట్టు తేల్చింది. ఈ స్కామ్కు సంబంధించిన నివేదికలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పేరు కూడా పేర్కొంది.
ఆయన మంత్రిగా ఉన్న సమయంలో టెలీ హెల్త్ సర్వీసెస్ అనే కంపెనీ నుంచి నామినేషన్ పద్దతిలో మెడిసిన్ కొనుగోళ్లకు సిఫారసు చేసినట్టు అందులో పేర్కొంది. అయితే అచ్చెన్నాయుడు మాత్రం తనపై వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. తెలంగాణలో ఎలాగైతే అమలు చేశారో... ఏపీలో కూడా అదే విధానాన్ని అమలు చేశామన్నారు. ప్రధాని ఆదేశాల మేరకు టెలీ హెల్త్ సర్వీసెస్కు ఆర్డర్స్ ఇవ్వడానికి లేఖ రాసినట్టు తెలిపారు.