నేదురుమల్లిపై బిజెపి వేటు:టిడిపిపై మండిపాటు...కోర్టుకు వెళ్తాం
అమరావతి: మాజీ సీఎం నేదురుమల్లి జనార్ధన్రెడ్డి తనయుడు, బీజేపీ నేత నేదురుమల్లి రాంకుమార్రెడ్డిపై ఆ పార్టీ బహిష్కరణ వేటు వేసింది. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ రాంకుమార్రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించింది.
ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ నిర్ణయం తీసుకున్నారు. నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి వైసిపిలో చేరనున్నట్లు అనుచరులతో సమావేశంలో తానే స్వయంగా ప్రకటించడంతో బిజెపి బహిష్కరణ చర్యలు తీసుకుంది. నిజానికి నేదురుమల్లి పార్టీ వీడుతున్నట్లు ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుండగా ఆయనను నిలువరించేందుకు ఇటీవల బిజెపి పార్టీ పదవిని కూడా కట్టబెట్టింది. పదవి వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే రామ్ కుమార్...జగన్ ను కలిసారు.
అనుచరులతో...సమావేశం
తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న వైసిపి అధినేత జగన్ ప్రజాసంకల్ప యాత్రలో ఆయనను కలసి తాను పార్టీలోకి వచ్చే విషయాన్ని వెల్లడించారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని నేదురుమల్లి జనార్థన్ రెడ్డి అభిమానులు, ముఖ్య అనుచరులతో నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి ఆత్మీయ సమావేశాన్ని నెల్లూరు స్వర్ణముఖి అతిథి గృహంలో బుధవారం నిర్వహించారు.
చెప్పకనే...చెప్పేశారు
ఈ సందర్భంగా కార్యకర్తలు, అనుచరులు వారి అభిప్రాయాలను వివరించారు. రాజకీయ భవిష్యత్తు కార్యాచరణపై పాల్గొన్న వారందరూ అభిప్రాయాలను వెల్లడించారు. ఇప్పటికే ఆయన అభిమానులు వైసిపిలోకి రావాలని రామ్ కుమార్ రెడ్డిపై ఒత్తిడి తెచ్చారు. మీ అభీష్టం మేరకే నడుచుకుంటానని ఆయన వారితో తెలిపారు. గురవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని ఆయన కార్యకర్తలతో అన్నారు.
టిడిపిపై...సోమూ వీర్రాజు ఫైర్
మరోవైపు టిడిపి పై బిజెపి నేతల విమర్శల పర్వం కొనసాగుతోంది. బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు గురువారం మీడియాతో మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ ప్రకటనల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫొటోలు లేకుండా...చంద్రబాబు, లోకేష్ ఫొటోలే పెడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై తెలుగుదేశం పార్టీ నేతలు సమాధానం చెప్పాలని ఆయన. అధికధరలకు విద్యుత్ కొనుగోలుతో రాష్ట్రంపై రూ. 20వేల కోట్ల భారం పడుతుందని ఆయన విమర్శించారు. విద్యుత్ కొనుగోళ్లపై ఈ విషయంలో కోర్టుకెళ్తామని సోమూ వీర్రాజు వెల్లడించారు.
ఎమ్మెల్సీ మాధవ్...డిమాండ్
మరో బిజెపి నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ మాధవ్ కూడా గురువారం మీడియాతో మాట్లాడుతూ టిడిపి ని దుయ్యబట్టారు. జివీఎల్పై టీడీపీ నేతల ఎదురుదాడి పిరికిపంద చర్య గా ఎమ్మెల్సీ మాధవ్ అభివర్ణించారు. పీడీ అకౌంట్లపై ప్రశ్నిస్తే ఉలికిపాటు ఎందుకని ఆయన టిడిపి నేతలను నిలదీశారు. కాపు రిజర్వేషన్లపై జస్టిస్ మంజునాథ కమిటీ నివేదిక బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కాపు రిజర్వేషన్లపై హడావుడిగా తీర్మానం చేసి కేంద్రానికి పంపి చేతులు దులుపుకున్నారని ఆయన విమర్శించారు. కాపులను చంద్రబాబు మభ్యపెడుతున్నారని ఎమ్మెల్సీ మాధవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.