ట్విస్ట్: బీజేపీ మెదక్ అభ్యర్థి జగ్గారెడ్డి, వీరే.. (పిక్చర్స్)
హైదరాబాద్: మెదక్ లోకసభ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా జగ్గారెడ్డి పోటీ చేయనున్నారు. బుధవారం జగ్గారెడ్డి (తూర్పు జయప్రకాశ్ రెడ్డి) బీజేపీలో చేరారు. మెదక్ లోకసభ బీజేపీ అభ్యర్థఇగా జగ్గారెడ్డి పేరును ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. జగ్గారెడ్డి మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేయనున్నారు.
జగ్గారెడ్డి బీజేపీలో చేరారని, ఆయన నామినేషన్ దాఖలు చేస్తారని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి చెప్పారు. గతంలో బీజేపీలో పని చేశానని, ఏబీవీపీ నుండి క్రియాశీలక కార్యకర్తగా ఉన్నానని జగ్గారెడ్డి ఈ సందర్భంగా అన్నారు. మెదక్ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని చెప్పారు.
తాను మొదట బీజేపీ కార్యకర్తనేనని, ఇప్పుడు సొంతింటికి వచ్చినట్లుగా ఉందన్నారు. తెరాసకు ప్రజలకంటే ఉప ఎన్నికలంటేనే ప్రేమ అన్నారు. తనను గెలిపిస్తే భారీగా కేంద్రం నుండి నిధులు తీసుకు వస్తానని చెప్పారు. బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి, జగ్గారెడ్డి, బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనా రెడ్డి, చింతల రామచంద్రా రెడ్డిలు పాల్గొన్నారు.
కేసీఆర్కు సవాల్!
జగ్గారెడ్డికి మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పట్టు ఉంది. అంతేకాకుండా, ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యతిరేకిగా ముద్రపడ్డారు. జగ్గారెడ్డి తొలుత బీజేపీలో పని చేశారు. అనంతరం తెరాసలోకి వెళ్లారు. వైయస్ ఆకర్షణ మంత్రం, కేసీఆర్తో విభేదాల కారణంగా ఆయన కాంగ్రెసు పార్టీలో చేరారు. నిన్నటి వరకు ఆయన కాంగ్రెసు పార్టీ నేతనే. ఇప్పుడు పాతగూటికి చేరుకున్నారు.
సమైక్య ఏపీలో జగ్గారెడ్డి నిత్యం.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ను సవాల్ చేశారు. మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆయనకు పట్టు ఉంది. దీనికి తోడుగా బీజేపీ బలం, టీడీపీ సహకారం తోడైతే.. జగ్గారెడ్డి గెలుస్తారని కమలదళం భావిస్తోంది.
జగ్గారెడ్డి ఇలాకాలో కేసీఆర్కు సవాలేనని అంటున్నారు. ఉప ఎన్నికల్లో తమ పార్టీయే గెలుస్తుందని, కేసీఆర్కు వచ్చిన మెజార్టీ కంటే తగ్గదని తెరాస చెబుతోంది. కాంగ్రెసు పార్టీ కూడా గెలుపుపై ధీమాతో ఉంది. కాగా, కాంగ్రెస్, తెరాసలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలను బరిలోకి దింపడంతో.. బీజేపీ కూడా అధే సామాజికవర్గానికి చెందిన నేతను బరిలోకి దించిందంటున్నారు.
కొత్త ప్రభాకర్ రెడ్డి తరఫున నామినేషన్ దాఖలు
మెదక్ లోకసభా స్థానానికి పోటీ చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి తరఫున మెదక్ జిల్లా నేతలు నామినేషన్ దాఖలు చేశారు. మెదక్ పార్లమెంటు స్థానానికి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కొత్త ప్రభాకర్ రెడ్డిని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ తరఫున సునీత లక్ష్మా రెడ్డి, బీజేపీ తరఫున జగ్గారెడ్డిలు నామినేషన్లు దాఖలు చేశారు. మరోవైపు, నందిగామ ఉప ఎన్నికకు టీడీపీ అభ్యర్థిగా తంగిరాల సౌమ్య, కాంగ్రెస్ అభ్యర్థిగా బోడ బాబురావు నామినేషన్ దాఖలు చేశారు. నలుగురు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేశారు.
జగ్గారెడ్డి
మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) భారతీయ జనతా పార్టీ తరఫున మెదక్ లోకసభ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయన నామినేషన్ దాఖలు చేశారు. వెంట ఎర్రబెల్లి, రేవంత్, ఎల్ రమణలు హాజరయ్యారు.
కొత్త ప్రభాకర్ రెడ్డి
తెరాస అభ్యర్థిగా ప్రముఖ వ్యాపారవేత్త కొత్త ప్రభాకర్ రెడ్డి పేరును ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు చంద్రశేఖర్రావు ఖరారు చేశారు. ఆయన బుధవారం మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు.
కొత్త ప్రభాకర్ రెడ్డి
టిఎన్జీవో సంఘం అధ్యక్షుడు దేవిప్రసాద్కు టికెట్ ఇవ్వాలని ఎన్జీవో సంఘాల నేతలు కోరినప్పటికీ సామాజిక వర్గాన్ని సైతం దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ప్రభాకర్ రెడ్డి పేరు ఖరారు చేశారు. త్వరలోనే శాసన మండలి సభ్యులుగా దేవీప్రసాద్కు అవకాశం కల్పించనున్నట్టు కేసీఆర్ హామీ ఇచ్చారు.
సునీత లక్ష్మా రెడ్డి
మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకురాలు సునీత లక్ష్మారెడ్డి కాంగ్రెసు పార్టీ తరఫున మెదక్ ఉప ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు. సునీత నామినేషన్ దాఖలు చేశారు. ఆమె వెంట దామోదర రాజనర్సింహ, గీతా రెడ్డి, షబ్బీర్ అలీ, విహెచ్లు వచ్చారు.